పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

246

కవికోకిల గ్రంథావళి


చుండెను. కొందఱు పండితులు ఇట్టి మార్పులకు సాధుత్వము ప్రసాదించు కొఱకు అరిస్టాటలు లక్షణసూత్రములను సాఁగఁదీసి క్రొత్తవ్యాఖ్యానములు చేయుచుండిరి. మఱింత లాగునప్పటికి ఆసూత్రములు తెగిపోయెను. అప్పటినుండియుఁ బ్రాతలక్షణములు క్రొత్త నాటకములకు మార్గదర్శకములు కావు అను వాదము బయలు దేరినది. షేక్‌స్పియరును అతని సమకాలీనులును నాటకములను రచియించిరి. ఈ నాటకములలోని విశిష్టత యేమనఁగా: స్థలై క్యముండదు.-- కథ కొన్నేండ్లపాటు జరిగినదిగనైన ఉండవచ్చును. ట్రాజెడీ చూచునప్పుడు కలుగు జాలి, భయము, చిత్తసంక్షోభము మున్నగువానియొక్క యొత్తిడివలన జనించు మనోనిర్భరత్వమును సడలించు హాస్యము కొన్నిపాత్రలమూలమున సంపాదింపఁబడును. ఈ కాలముననే Tragi-Comedy అను మిశ్రనాటకము ప్రభవించినది. ఇటువంటి నాటకము గ్రీకు నాటక లక్షణములకు వ్యతిరేకము కావున గ్రాహ్యముకాదు అని కొందఱు ఆ కాలపు రసలుబ్దులు వాదించిరి. కాని, ఈ తరగతి నాటకము గ్రీకు లక్షణములకు వ్యతిరేకముగ నున్నను, మానవ జీవితమునకుఁ బ్రతిబింబకముగనున్న దనియు ఇట్లు రచించుట కళానైపుణ్యమనియు జాన్సను పండితుఁడు సిద్ధాంతము చేసెను. పూర్వలక్షణ విరుద్ధము లయ్యును బ్రజానురంజకము లగునేని అంగీకృతములయి అట్టి నాటకములు భావినాటక లక్షణములకు లక్ష్యములై పెంపొందఁగలవు.