పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

కవికోకిల గ్రంథావళి

కాళిదాసుని కవితా సమ్మోహన ప్రభావమునకు చిక్కి సహానుభూతివలన తామె దుష్యంతుల మనుకొని శకుంతల వనవిహార శృంగారము ననుభవించి, పుస్తకము మూసిన వెనుక , కలగని మేల్కొన్నవారివలె లోకము దెలిసి, దుష్యంతుడు తుమ్మెదనుగురించి అనుకొన్నట్లుగనె తామున్ను దుష్యంతుని ఉద్దేశించి "కృతార్థుడవు నీవే నోయ్” అని దీర్ఘనిశ్వాసము విడిచిన పఠితలు ఎంద రుండరు?

నలకూబరసన్నిభుడైన ప్రవరాఖ్యుడు వరూధినికంట బడినాడు. ఆమె అబ్బురమొంది నయనాంబుజములు వికసించునట్లు చూచినది.

చూచి, ఝళం ఝళత్‌కటకసూచితవేగపదారవింద యై
లేచి కుచంబులున్ దురుము లేనడు మల్లలనాడ నయ్యెడన్
బూచినయొక్కపోకనునుబోదియఁ జేరి విలోకనప్రభా
వీచికలం దదీయపదవీకలశాంబుధి వెల్లిగొల్పుచున్.

పెద్దన వరూధినిని ప్రతిక్షణవ్యగ్రమైన కార్య సంచలనముతో జీవత్ప్రతిమవలె మన కన్నులకు కట్టునట్లు చిత్రించినాడు. ఆమె తత్తరము ఆశ్చర్యము ఈ పద్యములోని ప్రత్యక్షరములో అంకితమై ఉన్నది. తాను కన్యాత్వ సహజమైన సిగ్గు గల వినయవతి యని ప్రవరాఖ్యునికి తోపవలయును. ఆయన వరూధిని సౌందర్యమును చూచి ముగ్ధుడు కావలయును. ఈ రెండుకార్యములు ఒక్క సారిగా సాధించవలయును. ఆమె పక్కననున్న పోకచెట్టువెనుక నిలుచున్నది. ఏచింత చెట్టుచాటుననో నిలుచున్నయెడల ఆమె సౌందర్యము ప్రవరా