పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

కవికోకిల గ్రంథావళి

వాడిఅయినట్టి కొనగోళ్ళతోడ (నొక్కి)
చురుకుమనునట్లు పెట్టిన (షోకులాడి)

మొదటి పాదమున 'నొక్కి' అనియు రెండవ పాదమున 'షాకులాడి' అని చేర్చిన తేటగీతి పాదములగును.

నూరువెక్కిరింపులనాలికల్ (గవెలికి)
దిక్కుదిక్కుల పకపకల్ (తేజరిల్ల)

ఈ పాదములలో మొదటి దానికి 'గ వెలికి' అనియు రెండవ దానికి 'తేజరిల్ల' అని చేర్చిన తేటగీతి పాదములగును,

వీరి హృదయములలో దేవుడు ప్రసాదించిన లయా శక్తి ఉన్నది. నవత్వముకొరకు సహజశక్తిని అడగ ద్రొక్కి, పరిపూర్ణమైన ఆకారమునందు అవయవములు భేదించి వీరు సాధించిన ఆ మహాప్రయోజనమేది? ఈ అపకారము వారికే కాదు, లోకమునకు కూడ. ఒక చిత్రమును యిరువయి తుంటలుగ కత్తిరించి చీట్లప్యాకీ కలిపినట్లు కలిపి మరల మేజాపై నెరిపిన ఒక అసంబద్దమైన (Dis - harmonious) చిత్రము కనబడును, ఈ విచిత్ర సౌందర్యమేనా ఛందో వైకల్యమునందు వీరు ఆశించునది !

ఈ నవకవులు రచించు వచనపు తుంటలకు పద్యములని ఎట్లు పేరువచ్చినది? జామెట్రివలన, ప్రోసు పేరాను లయిను ప్రకారము కత్తిరించి వివిధ పరిమితులుగా తుంటలు చేసి, ఒక దాని క్రింద నొకటి అతికించిన ప్రోసు, పోయిట్రీగా మారును. ఇది జామెట్రి కవిత్వము. ఈ కవిత్వమున, తిక్కన చెప్పినట్లు చెవి ప్రథానముకాదు, కన్ను ప్రధానము. ఇది తను భంగమువలన గద్యమూకాదు. ఛందోవిరహితమై