పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

కవికోకిల గ్రంథావళి

 పర్యముగ వచ్చు ఆచారప్రీతి యొక వంకకు, నూతన గతులు మఱొక వంకకు ఆకర్షింపఁజొచ్చినవి. ఈ గుంజులాటయె వరూధినీ ప్రవరుల వ్యవహారమునందు మనకు గోచరించును.

కవికి ఎవరిపై ప్రీతియెక్కువ? వరూధినియందా లేక ప్రవరునియందా ? ఈ విషయము గనుగొనుటకు సాధ్యమగునా? ఈ రెండు పాత్రలను కవి చిత్రించిన విధమును విమర్శించితి మేని. ఈరహస్యము బయలు పడును. కవుల కిట్టి పక్షపాత ముండునా? ఏల యుండకూడదు ? వారును మానవు లే ? వారికిని రాగ ద్వేషములు కలవు. ఇష్టానిష్టములు కలవు. . మానవుని లోపత్వమునందును అసంపూర్ణతఁయందును కవికి సానుభూతికలదు. అపుడే యాతఁడు మానవ స్వభావమును గుర్తించినవాఁడగును. పీడించుటయు వేధించుటయు నీతియుతమైనను నీతి బాహ్యమైనను రసార్ద్రహృదయుని చిత్తమును గాయము సేయును. “ధర్మమునిర్వర్తింపవలయును: పరధర్శముకంటె స్వధర్మము శ్రేయము" అని చెప్పఁబడినది, ఎఱుకల వాని ధర్మము పక్షులను జంపి జీవించుట, అయినను, వాని కఱకుటమ్మునకు గుఱియైన క్రౌంచము యొక్క దుస్థితిని జంటపక్షియొక్క శోకావేగమును గాంచినప్పుడు నవనీత సదృశమైన వాల్మీకిచిత్తము కరఁగి ధారలుధారలుగ స్రవించినది. యజ్ఞముసేయుట అధర్మముగాదు; బలిపీఠముయొద్దకుఁ దీసికొని పోఁబడుచుండిన గొఱ్ఱె పిల్లను బుద్ధభగవానుఁడు చూచినప్పుడు ఆ మహాపురుషుని హృదయము కరుణారస తరంగితమై దానిని కాపాడుట కుద్యుక్తుఁడాయెను. ధర్మము హృదయములేని యంత్రము, మానవుడు హృదయముగల