పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

కవికోకిల గ్రంథావళి


భారతము మున్నగు పెద్దకల్పనలకుసు, శాకుంతలాది మనోహర నాటక రచనలకును కావలసినంత లోకానుభవమును, సృజనశక్తియు, శిల్పనైపుణియు నలవడి యుండదనుట స్పష్టము. హైందవసమాజము చాల ఉన్నతదశకు వచ్చిన యనంతరము అట్టికావ్యములు, నాటకములు పుట్టియుండునని నిర్ణయించుటకు వానియందు వర్ణింపఁబడిన సాంఘికాచార వ్యవహారములే తగిన సాక్ష్యములుగ నున్నవి.

మానవునికి భావప్రకటనము గావింపవలసినయక్కఱ జ్ఞాన మంకురించినప్పటినుండియుఁ గలదు. ఉద్దేశములు వెలిపుచ్చుటకుఁ దగినభాష యుత్పన్నముగాని ప్రధమదశయందు గూడఁ, జేసైగలు, కనుసైగలు మున్నగువానిచేత మనుజులు తను వ్యవహారములను సాఁగించుకొనుచుండిరి ఆ కాలమున వారిబుద్ధి యంతగా వికసింపకుండినందువలన వివిధ భావోత్పత్తి కంతయవకాశ ముండియుండదు. కాని, బహిః ప్రకృతిసంబంధమువలన వారిహృదయములందుఁ గ్రమక్రమముగ భావవికసనమును, ఆ భావమును బ్రకటించుటకుఁ గావించు ప్రయత్నము వలన భాషయు నభివృద్ధి చెందుచు వచ్చెను. ఉరుములు, మెఱుములు, మేఘములు, వర్షములు, వడగండ్లు, ఉల్కా పాతములు, నక్షత్రములు, సూర్యోద యా స్తమానములు, నదులు, కొండలు మున్నగు నైసర్గిక చిత్రములను దర్శించినప్పుడు ఆయా కారణములఁ దెలియమి, ఆదిమమానవులు సంతోషాశ్చర్య భయవిషాదముల వెలిపుచ్చుచుండిరి, నాట్యములు సలుపుచుండిరి, పాటలు పాడుచుండిరి. ప్రార్థనలు సలుపుచుండిరి. కాని, వారి యాటపాటలకు నియమములు