92
కాశీమజిలీకథలు - మూడవభాగము
వానిగా నిరూపించుచు దాను వ్రాసిన పత్రికలన్నియు నా పట్టణప్రభువునొద్ద కనిపెను.
ఆ వార్త అంతకుమున్నె యాపట్టణమంతయు వ్యాపించి ఉన్నది. నృపతియు విని ఉండెను. దానంజేసి అతండు కందర్పుని యెదుట నాసాక్షుల విచారించి నీవీ యజమానుని విషమిడిచంపినట్లు వీరు చెప్పుకొనుచున్నారు ఒడంబడెదవా? లేక చంపనట్లుగా నిదర్శనము లేమైనం జూపెదవా? అని యారాజడిగెను ఆ మాటలే తలవరి మెల్లగా నతనికి బోధించి యేమి చెప్పెదవని సూచించగా గందర్పుడు తెలిసికొని నేనేమియు నెఱుంగను నాకు సాక్షులెవ్వరునులేరు. న్యాయమును దెలిసికొని మీ యిష్టము వచ్చినట్లు చేయుడిని సంజ్ఞచేసెను.
అప్పు డారాజు నేరము చేసినట్లే నిశ్చయించి కందర్పునికి నుఱిశిక్ష విధించి కింకరుల యధీనము జేసెను. యమకింకరులవలె భయంకరులగు నారాజభటులతని నప్పుడే బండియెక్కించి పట్టణమంతయుం ద్రిప్పుచు గ్రమంబున వధ్యభూమికి గొనిపోయిరి. మరణము తనకాసన్నమైనదని యెఱింగి కందర్పుడాత్మ గతంబున నిట్లు తలంచెను. ఆహా!
శ్లో: నియతిర్విధాయ పుంసాం ప్రధమంసుఖ మవరిదారుణం
దుఃఖం కృత్వాలోకంచవలాతటి దివ వజ్రం నిపాతయతి.
గీ. అతిచిరంబగు తేజుంబు జూపి పిదప
పిడుగు మొత్తెడు మెఱపు కైవడిని ముందు
సుఖము చవి జూపి పిదప హెచ్చుగను
దుఃఖముల ఘటించును గాదె లోకులకు నియతి.
అన్నన్నా! సమానులలో నుత్తముండని పేరుపొందిన భూపాలునకు జనియించి పదియారేడు ప్రాయములో బెక్కువిద్యలు గ్రహించి విద్యారూపశీలములచే నసమానుండ ననిపించుకొని పట్టభద్రుడు కానున్న నాకిట్లు బంధుజనశూన్యంబైన పరదేశములో సహాయము చేయబూనిన యొకని జంపితినని నపయశము మీద బడ బలవన్మరణము విధించె నేమనవచ్చును. అనన్యజలబ్ధంబైన చర్మకురంగంబే నాకీయాపద దెచ్చి పెట్టినది. భరతఖండంబున ననేకదివ్యక్షేత్రంబులు పట్టణంబులు గలిగి యుండ దొలుతనే యీ క్రూరదేశమునకు రావలయునను బుద్ధి యేమిటికి బుట్టవలయును. అయ్యయ్యో! ఈకురంగంబు వలన నెన్నియో దేశములు తిరిగి ఎన్నియో విశేషములు సంపాదింపవలయునని ఎన్నియోఊహలతో నుంటి. అన్నియు దృటిలో నిష్ఫలములై పోయినవి కటకటా! మాలదైవమా! నాయుచ్ఛ్రయము నీకంటి కెంత వెగటైనది? ఈ రూపము నీ విద్యలు నీ గుణములు నీయూహలు, నాయుశూన్యముగా నాకేమిటికై యిచ్చితివి. హా! తల్లిదండ్రులారా, వృద్ధుల మదేకపుత్రుల మిమ్ములవిడిచితి నన్నుగానక యెంత చింతించెదరో! అక్కటా! గురువర్యా! నేని