పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(30)

చంద్రుని కథ

241

చూచుటయేకాని దాపునకు వచ్చి పల్కరించుటలేదు. అప్పుడు వారిట్లు మాటాడికొనిరట.

మల్లిక - సఖీ! నేను శ్రీశైలములో చూచినవాడితండే నాకు బాగుగ జ్ఞాపకమున్నది. ఎంత సొగసుగా నున్నవాడో యీ వసంతిక నడుగుము.

వసంతిక - నిజమేనమ్మా! నేను దాపుగాబోయి జూచితిని. అన్నా, ఆ సౌందర్యమేమని చెప్పుదును. మొగము చంద్రబింబమే. అవి కన్నులు గిన్నులుకావు. యువతీజనహృదయాకర్షితములైన మరుని మంత్రమత్స్యములని తలంచెదను. అట్టివాని కౌగిటలో జిక్కిన చక్కెరబొమ్మ భాగ్యమే భాగ్యము.

తమాలిక - వయస్యా! మనము నలకూబరు నెరుంగుదము గదా. వీని ముందర నతడేపాటివాడు. పెక్కులేల కంతుడో వసంతుడో జయంతుడో గావలయు లేకున్న భవదీయ భాగ్యదేవత యని తలంచెదను.

చారుమతి - మీరంతగా వర్ణించున్నారు. మాటాడినారా ?

మల్లిక - లేదు లేదు దాపునకుబోయి పల్కరించవలయునని ప్రయత్నించితినికాని కంపముచే మాటవచ్చినది కాదు

చారుమతి - అట్లయిన మల్లి కా! నీవువోయి యప్పురుషోత్తముని కులశీలనామంబుల దెలిసికొని ప్రసన్నతగా నుత్తరమిచ్చెనేని దీసికొని రమ్ము. సౌందర్య మేపాటిదో చూతము.

వసంతిక - చూచిన తరువాత విడువవు. నీవరవృత్తాంతము జ్ఞాపకము జేసికొని పిలిపింపుము.

చారుమతి - నేనంత బేలననుకొంటివా ? జగన్మనోహరంబైన వస్తువునుజూచి యానందించుటకుగాని మఱియొకటికాదు.

వసంతిక - కానిమ్ము. పిమ్మట నే యడిగెదనులే. నీ ధైర్యమేపాటిదో చూతము

అని యొండొరులు వితర్కించి యనుషంగా మల్లిక మెల్లగా నా యొద్దకు వచ్చినది. నేను దానింజూచి యా పుష్పవనములో దూరదూరముగా బోదొడంగితిని. అదియు బుష్పములు గోయునట్లభినయించుచు క్రమగ్రమంబున నాయొద్దకు వచ్చి నమస్కరింపుచు నైపుణ్యముగా నిట్లనియె.

ఆర్యా! మీరెవ్వరు? ఏదేశము? ఈ ఏకాంతగుహాంతరమున కేమిటికి వచ్చితిరి? ఇది మాణిభద్రుని కూతురు చారుమతి యను యక్షకన్యక విహారవనము, నేనా జవరాలి సఖురాలిని, నా పేరు మల్లిక మిమ్ములను మొన్నటి శివరాత్రినాడు శ్రీశైలమునందు బరివ్రాజకసంఘములో బురాణము వినుచుండ జూచినట్లు జ్ఞాపకమున్నది. మీ రప్పటి కచ్చటికి వచ్చితిరా? అని వినయగంభీర్యచాతుర్యంబు లేర్పడబలికిన విని నేను సానురాగముగా దానిం జూచుచు నిట్లంటిని.

అగునగు శ్రీశైలము వచ్చితిని. పురాణములను వింటిని. కాని నిన్నుజూచిన