పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(29)

చంద్రుని కథ

233

గలిగియున్నందున దాపునకుబోయి తొండముదట్టుచు నది యూతగాబూని దానిపయి కెక్కి కూర్చుంటిని. నా సాహసము దలంచుకొన నాకే యబ్బురముగా నున్నయది.

ఆ కొండ కడు నునుపుగా నుండుటచే నెక్కుట కడుదుర్ఘటమయినను నా వేదండం బతిపాటవముగా దృటిలో నెక్కినది. అది యెక్కడికిఁబోవునో యను తలంపుతో నేను జూచుచుండ నేమును వచ్చిన గుహముఖంబున బ్రవేశించినది. బ్రవేశించినతోడనే నాకు గుఱుతు తెలిసినది నేనప్పుడు మితిలేని యానందంబు జెందుచు బరమేశ్వరుని కరుణావిశేషంబునం దిరుగా నచ్చటికి బోవ దటస్థించినదని యుబ్బుచుండ విశాలమగు నాగుహలో నాగజము వడిగా నడచుచు నేను మొదట జూచిన స్ఫటికశిలామండపంబున నాకలశంబు దింపినది.

నేనును అందు దిగితిని. అప్పుడా గజము కదళీవనములోనికిం బోయినది. పిమ్మట నేనందున్న తటాకములో స్నానముచేసి యమ్మహాలింగముపై దజ్జలంబు అభిషేకంబు జేసి యందుండు పూవులచే నర్చించి ధ్యానించుచున్నంతలో నమానుషంబయిన పరిమళమొండు నాకు నాసాపర్వము గావించుటయు నెవ్వరో వచ్చుచున్నారని యూహించిలేచి యాప్రాంతమున నొకమూల దాగియుంటిని.

అప్పుడు కొందఱు సుందరులు గుహద్వారంబునుండి వచ్చిరి. వారి జూచి నంత నామేను వణకజొచ్చినది. ఎట్టకేలకు మనస్సు దృఢపరుచికొని వారి యాకార విశేషమునకు నాశ్చర్యమొందుచు నం దణగియుండి వారేమి చేయుదురో యని చూచుచుంటిని.

అప్పు డాకొమ్మలు పుట్టంబులు విప్పి గట్టునబెట్టి యత్తటాకంబులో గొంతసేపు జలకేళిం దేలి వినోదముగా మాటలాడికొనుచు వెండియుం బట్టలందాల్చి యమ్మంటపంబున లింగంబుచుట్టునుం గూర్చుండిరి. వారిలో నొకతె యందున్న విపంచి ధరించి కంఠస్వరంబు దంత్రీనాదంబుతో మేళగించి హాయిగా బాడుచుండ వేఱొకతె పూజాపాత్రంబులు సవరింప మఱొకతె గంథాక్షతాదు లందియ్య నొకసుందరి యాలింగంబు నిర్మాల్యంబుల దీయుచు నబ్బురముతో జూచి బోటులారా? ఈ నిర్మాల్యం బిటులున్న దేమి? యిది మును నేజేసిన పూజాద్రవ్యము కానియట్లున్నది క్రొత్తవారెవ్వరేని వచ్చి పూజించిరా? అని పలికిన నచ్చేడియ లిచ్చటి కెవ్వరు వత్తురు . నీవు మరచి యట్లనుచున్ దానవు. నిర్మాల్యమునకు గుఱుతులేమి తెలియునని పలికిరి.

అప్పు డమ్మగువ మీరట్లనిన నేమిచెప్పుదును. నాపూజ నాకు గుఱుతుకాదా. కానిండు? తరువాత విమర్శింతమని పలుకుచు నా నిర్మాల్యమును దీసి కనకకలశంబునగల జలం బాలింగమున కభిషేకము చేసినది. ఇంతలో మునుపటి మాతంగంబు పెక్కురకముల పూవులును, బత్రియు దీసికొనివచ్చి యందుంచిపోయినది కొందరు చేడియ లాపత్రి నందించుచుండ శివనామముల బఠింపుచు నాకలకంఠి యా స్వామి నర్చింపదొడంగినది.

తరువాత ధూపము దీపముల నిచ్చి తద్గజానీతంబులగు కధళీఫలముల నైవే