పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయభద్రునికథ

23

మగునని తలంచి, అది తనభార్యయని, దానితో జెప్పక, యాపట మొకమూల బాఱవైచి, సుమిత్రునియందు బద్దమత్సరుండై , నిట్టూర్పుల నిగిడించుచు గొంతసేపున కావెలది కావించిన యుపచారమువలన గలుషమైన మనస్సును నిర్మలపరచుకొనియెను.

అచ్చట సుమిత్రుడును సునీతియున్న మేడకుబోయి కడమ అలంకారము లన్నియుం గావించి, అతనిరాక వేచి యుండెను. కాని యెప్పటికి నతనిజాడ గనంబడదు మిక్కిలి కోపముతో అనంగచంద్రిక యింటికిం జనియెను. తలుపు మూసి యుండుటచే దాను వచ్చినట్లు లోపలికిం వర్తమానము బంపెను ఆ మాటలు విని జయభద్రుడు మిక్కిలి కోపించుచు, నెద్దియో చీటివ్రాసి చేటికచే నతని కందింపజేసెను. ఆచీటి విప్పి చదువ నిట్లున్నది! నీవు నాకు మిత్రరూపుడవైన శత్రుడవు. నీవు నాజన్మావధికి సరిపడిన అపకారము గావించితివి. యింతటితో నీ స్నేహము చాలును. ఇక నీవు నాదగ్గిర కెన్నడును రావలదు నీనీతులు నాకుపయోగింపవు. అని యున్న యుత్తరము గన్నుల నీరుగ్రమ్మ రెండుమూడు సారులు చదివికొని హా! ప్రియసుఖా! అని వణకుచు మూర్చవోయి అంతలోలేచి, తలయూచుచు అన్నా! వెలయాలిబోధ యింతచేసినది. ఆయ్యో, ఇకనాకు మీత్రుని దర్శనము లభింపదు కాబోలు. యేమిచేయుదును నేనితని కేమి యపకారముచేసితిని. యిట్లు పరుషముగా వ్రాయుటకు నేమి నిందమోపినదోకదా? ఒక్కనిమిషము నేను గనంబడనిచో మిక్కిలి పరితపించువాఁ డెంత యుగ్రముగా వ్రాసెను. మందులచే అతని హృదయముమార్చిన దీనినేమిచేసినను దోసములేదు. అయ్యో! అతనిరాక నిరీక్షించుచున్న సునీతితో నేమని చెప్పుదును ఆమెయుత్సాహమంతయు నిష్ఫలమయ్యెనే? కటకటా అని అనేకప్రకారముల బలవరించుచు, నెట్టకే ధైర్యము దెచ్చుకొని యిప్పుడును నతనియం దించుకయు నీసుబూనక గణికాకృత్యమును గుఱించి వితర్కించుచు మరల సునీతి అంతఃపురమునకు బోయి రహస్యముగా నొకయుత్తరము వ్రాసి సునీతికిం బంపెను.

తల్లీ! నీప్రియుండు వేశ్యాలోలుండై రాకున్నవాడు నాయం దకారణవైరము వహించి, నామాట పాటింపకుండె. నే నతనిగుఱించి మిక్కిలి ప్రయత్నము చేయుచున్నవాడ. ఇంతదనుక నీ వీగుట్టు వెల్లడిచేయక గుప్తముగా నుంచుము. కాలము మంచిదైన అన్నియుఁ జక్కఁబడును. అల్లరిచేసితివేని నిహపరములకు దూరమగుదువు. నీవు పతివ్రతవుగాన నింతగా వ్రాసితిని. అనియున్న యుత్తరము జదువుకొని, సునీతి తలయూచుచు, నేమియుం బలుకక యెవ్వరికింజెప్పకఁ వేఱొకరీతి అతనిరాక కభినయించుచు గుప్తముగాఁ గాలక్షేపము చేయఁదొడంగినది. సతులు పతుల నవమానపరుతురా? జయభద్రుడు భోజనసమయమునందప్ప సంతతము ననంగమంజరితోనే యుండును. అతని తల్లియు నన్నలును, ఆ రహస్య మేమియు తెలియక అతడు అంతఃపురములోనే యున్నవాఁడని, అంతగా విమర్శింపరైరి.