పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుష్టవర్మకథ

171

వెంకటకవి - అదియునైనది.

గోవింద - ఈ వెంకటకవి విజయనగరంబునకుంబోయెనని వింటిని. అచ్చటి విశేషము లీయనకుం దెలియగలవు. కవిగారు అచ్చటి వింతలేమి ?

వెంకట - మందారవల్లి మిగుల జంఝాటముతో విజయనగరి కరిగి మొదట సభజేసి యందు భట్టుమూర్తిలోనగు పండితుల బరాజితులం గావించినది తరువాత తెనాలి రామలింగకవి లవిత్రయను పేరుతో బోయి శిష్యవర్గముతోగూడ నా చేడియను నోరు మెదల్పకుండ జేసెను.

గోవింద --- మొదటి సభలో అతండు లేడా యేమి ?

వెంకట - లేడట! ఉండిన అంతయేలవచ్చును. మొదటి విజయదివసంబున మందారవల్లి బ్రాహ్మణులకు మిక్కుటముగా ద్రవ్యము పంచిపెట్టినది. వానిలో మాకును కొంతలాభము కలిగినది.

గోవింద - తరువాత నేమిజరిగినది.

వెంకట - రాయలవారు దాని వస్తువాహనములన్నియు లాగికొనిరి. పిమ్మట నా కొమ్మ తగవునకై ఢిల్లీ చక్రవర్తి యొద్దకుంబోయినదట.

పేరావ - కటకటా! యెంతమాట వింటిమి? ఆ పుణ్యాత్మురాలి కట్టి యాపద రావలసినదికాదు. ప్రతిదినము బ్రాహ్మణుల కనేక దానములు గావించునది.

గోవింద - రామలింగకవి చర్యలు కడునద్భుతముగా వినుచుంటిమి. అతండు మన దుష్టవర్మకు బురాణము జెప్పగలడేమో.

వెంకట - విపరీతపురాణము చెప్పి బుద్దివచ్చునట్లు చేయును. క్రూరబుద్ధులని తెలిసినచో వారింబరిభవించుటయే. యతనికి వ్రతము.

గోవింద - అతని యొద్దకుబోయి యొకసారి రమ్మని ప్రార్థించినం బాగుండును. దుర్మార్గుడు క్రొత్తయర్థములం జెప్పుమని యూరక వేపుచున్నాడు. రామాయణములో భారతార్థము భారతములో రామాయణార్థము జెప్పవలయునట.

వెంకట - వీనికి గ్రొత్తయర్ధములు బాగుగా జెప్పగలడు. సీ! ద్రవ్యాశచే యనవారు వోయి యతండు పీఠముపై గూర్చుండ గ్రింద గూర్చుండి పురాణము చెప్పుచుందురు. ఇంతకన్న యధమమున్నదా.

గోవిం - ఏమిచేయుదుము. వెళ్ళకపోయితిమేని పూర్వులిచ్చిన మాన్యములు లాగికొనును. నీవు చెప్పినదే శాస్త్రమని స్తోత్రములు చేయుచు నేలాగో కాలక్షేపము చేయుచున్నాము. వాని పాపము వానిదే మనకేమి.

అని యిట్లు కొంతసేపు ముచ్చటించుకొని యా బాడబులు నిష్క్రమించిరి. వారి మాటలువిని రామలింగకవి యింటికివచ్చి యా వృత్తాంతము సుభద్రునకుంజెప్పి యా దుష్టవర్మం గుఱించి ఒక యింటి బాహ్మణుని అడిగిన అతండిట్లనియె.

అయ్యా! దుష్టవర్మకు రెండుమూడు గ్రామములు గలిగియున్నవి. అతని పూర్వులు మిక్కిలి విఖ్యాతులు. బ్రాహ్మణులనేక భూదానములు గావించిరి.