పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

కాశీమజిలీకథలు - మూడవభాగము

అప్పుడు కేకలు వేయుచున్నందున చిల్లర బ్రాహ్మణులందఱు లేచి లక్ష్మణ కవిని జుట్టుకొని నా పేరు. నా పేరు వ్రాయండి. నేను సంస్కారినని అరవజొచ్చిరి ఆసమర్దమునకు దాళక లక్ష్మణకవి పెద్దన్నను రక్షించి యీ యాపద దాటింపుమని వేడుకోగా నత డతని సందిట బట్టి యాబ్రాహ్మణుల ద్రోసికొని లోపలకు బోయెను. ఆ సందడిలో లక్ష్మణకవి చేతనున్న కాగితము నెవ్వడో లాగికొని చింపి పారవైచెను. పద్దులకాగితము పోయినది. పోయినదని కేకలువై చిరి. అప్పుడెల్లరు లేచి హల్లకల్లోలముగా రొదజేయ దొడంగిరి ఆ ధ్వని రత్నావతియు విద్యావతియు దొందరపడజొచ్చిరి. ఇంతలో లక్ష్మణకవి దీసికొని లోపలకు బోయెను.

అప్పుడక్కవి తన్ను బునర్జీవితునిగా దలంచుకొనుచు నూపిరి విడిచి విశ్రాంతి వహించి యింతలో దనచేతనున్న కాగితము జారిపోయినదని తెలిసికొని పశ్చాతాపము జెందజొచ్చెను.

ఆతండు మిక్కిలి ధారణశక్తిగల పండితు డగుటచే బెద్దన్న గ్రామములోని వారి నందఱిని నెఱింగినవా డగుటచేతను వెండియు దాను బూర్వము వ్రాసినరీతి అంతయు గుఱుతుంచుకొని యాప్రకారము బ్రాహ్మణుల బేరెత్తి పిలిపించుచు గ్రమంబున సాయంకాలము వరకు దాని యాస్తి యంతయు బంచి బెట్టించెను.

విద్యావతియు మునుపు తనతల్లి జంగాలజేసిన విటపురుషుల నెల్లర రప్పించి వారివారి ద్రవ్యముల గురుతున్నంతవరకు నిప్పించినది.

అట్లు బ్రాహ్మణులు పాత్త్రానుసారముగా దమకు దానమిచ్చిన వస్తువాహనంబులం గొని రాజమార్గంబునం బడిపోవుచుండ గొందరు తమ కేమియు దానములు దొరకలేదని తిట్టుకొనుచు నరుగుచుండిరి. అప్పుడు పౌరులకు వాండ్రకు నీరీతి సంవాదము జరిగినది.

పౌరులు - ఏమయ్యా! ముందువెళ్ళిన బ్రాహ్మణులు రత్నావతిని కామధేనువుగా బొగడుచుండ మీరిట్లు నిందించుచున్నారు. మీకేమియు దాన మియ్యలేదా?

బ్రాహ్మణులు - మాకేమిటి కిస్తారు. ఈ యూరునున్న సోమయాజులు, అవధానులు, శాస్తుర్లుగారలే కాని దానిద్రవ్యమున కితరులు నర్హులు కారట. ఇంతకు పెద్దన్ని గాడిదపెత్తన మీలాగున యేడిసినది.

పౌరులు - కోటిరూపాయలు విలువగల తనయాస్తి అంతయు రత్నావతి ఈ దినమున బ్రాహ్మణాధీనము చేసినదంటే మీకు మాత్రమేమియు దొరకక పోవడమేమి?

బ్రాహ్మణులు - ఏమియా? మా ప్రారబ్దము. కలియబడి అడుగుదామురా, అంటే మా బుచ్చిరామిగాడు లోపలకు వెళ్ళితే చచ్చిపోతామని కదలనిచ్చినాడుకాడు. మొదటి లోపలదూరినవారి పని అందఱిది బాగానేయున్నది. మేము వీథి గుమ్మము దాపున యేడిసినందులకు తలయొక పదిరూపాయలు దొడ్డిసంభావన పారవేసినారు.