పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

కాశీమజిలీకథలు - మూడవభాగము

దప్పుగానెంచును. సతులకు బతియె తల్లియుదండ్రియు దైవమును, వీరిలెక్కనాకు లేదు. సత్వరముగా బోవుదము లెండు. యిందుండి యీ నిర్బంధముల బడనేల. యిందులకు బెద్ద యాలోచనలు చేయుచున్న వారని మధురిక చెప్పినది. ఆది యొక్కతియు నా కొఱకు విచారించును. మనము స్థిరపడిన తరువాత దానిని రప్పించుకొందమని పలుకుచు దాను ప్రయాణమునకు ఆతని దొందర పెట్టుచు అప్పుడే రత్నమండనములు మొదలైన వస్తువులు సవరించుకొనినది.

కందర్పుడు మిక్కిలి సంతసించుచు జీకటియండగనే యా జింకను బూరించి యాయించుబోణిని రమ్మని పిలిచెను. సంతసముతో అన్నెలతుక తదంతికమునకు వచ్చి నాథా? నేను ముందు గూర్చుండనా వెనుక గూర్చుండనా అని అడిగినది. ముందే కూర్చుండుమని చెప్పి తన గౌగిటిలో జిక్కబట్టుకొని కీలు ద్రిప్పుటయు ఆక్కురంగం బతిరయంబున గగనంబున కెగసి పఱవదొడగినది.

ఉ. అ పెనుచీకటింబడి రయంబున బోయెడివేళ వానితో
     నాపె హితానులాపముల నాడెడిఁగాని తదంతరిక్షయా
     త్రాపృధుఖేదమింత యహితంబని పల్కదు మన్మథాస్త్రసం
     తాపితచిత్తు లెన్నడును తక్కి న బాధల నెన్నరాత్మలోన్.

అని యెఱింగించి మణిసిద్దుడు వత్సా! ముందటికథ పెద్దదిగానున్నది. మనకు బయనము వేళయైనది లెమ్ము ముందటి యవసధనంబున దరువాయి వృత్తాంతము జెప్పెదనని యొప్పించి వాడు కావడిమోచికొని తనతోడనడచుచుండ ఆతండు ప్రణవజపము చేసికొనుచు నిరువదిమూడవ మజిలీ చేరి అందు తరువాయి కథ నిట్లని చెప్పందొడంగెను.