పుట:Jeevasastra Samgrahamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కల్లును, చెరుకురసమును సారాయిగా మార్చున దేది?

కల్లును సారాయిగా మార్చునట్టియు, చక్కెర నీటిలో పై జెప్పినప్రకారము చల్ల బడునట్టియు పదార్థ మొక్కటియే. ఇయ్యదియు, బూజు, కుక్కగొడుగు మొదలగు కొన్ని పదార్థములును శిలీంధ్రము లను నొకజాతిలోనివి. అందు మొదటిది తియ్యదనముగల ద్రవములయందుమాత్రము వృద్ధిబొందుచు వానిని సారాయిగా మార్చుచుండు స్వభావము గలదగుటచే దానిని మధుశిలీంధ్ర మందురు. ఈమధుశిలీంధ్రమునుగూర్చి తెలిసికొనుటకై యీ క్రిందిప్రకారము శోధన చేయుదము.

పై జెప్పిన కల్లునందు నురుగు కట్టు ద్రవపదార్థమునుండి యొక చుక్కను సూక్ష్మ దర్శనితో పరీక్షింపగా దానియందు వేనవేలు సూక్ష్మములయిన కణములు తేలుచుండుటచేత నది కలగియున్నట్లు తెలియగలదు (8-వ పటములో నెడమప్రక్కనున్న అ. చూడుము). ఈ కణములలో నొక్కొక్కటియు నొక్కొక మొక్క యని వ్రాసిన, చదువరులకు వింతగా నుండవచ్చును.

నిర్మాణము.

ఈ కణములు గోళాకారమైన మూలపదార్థపు సముదాయములు. ఇం దొక్కొక కణము రమారమి అంగుళములో 3,000-వ వంతు అనగా వికారిణిలో 30-వ వంతు పరిమాణము గలది. దానిచుట్టును సెల్లులూసు (Cellulose) తో చేయబడిన పలుచని పొర గలదు. సెల్లులూసు అనునది దూదియొక్క రూప