పుట:Jagattu-Jiivamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

జగత్తు - జీవము

కాబట్టి, జీవ సంబంధమగు చై తన్యంలో అవస్థానము అసంభవము, అచింత్యము. అదొకవేళ సాధ్యమైనప్పటికి భయావహం కానేరదు. శరీరంపోగానే, భౌతికయాతనలు అంతర్థానమగుట నిశ్చయము. ఇంద్రియ జనితములైన మానసిక నైతికవేదనలు సైతము తక్షణమే అదృశ్యమౌతాయి. నిత్యమగు ఆత్మ భూలోక జీవితకాలంలో శారీరక దుఃఖాల ప్రతిఘాతాన్నే అనుభవిస్తుంది. భగ్నప్రేమ, నిరాకృతానురాగము, అపజయము, నైరాశ్యము, కృతఘ్నత, మానహాని మొదలగునవి పంచేంద్రియములద్వారా ఆత్మను బాధిస్తాయి. శరీరవిముక్తమైన జీవాత్మ దుఃఖిస్తే శరీర స్మరణచేతనే దుఃఖించాలి, కాని, దేశకాలాతీతమైన ఆత్మ జీవాను బంధాలగూర్చి విచారించుట అసంభవము.

జీవాత్మ కేవలానందపిపాసి. అమందానందానుభూతియే తల్ల క్షణము. అట్టి జీవాత్మ దుఃఖించక విధిలేనిపక్షంలో తన సంకుచిత పరిమితికే దుఃఖించవలసియున్నది. కాని, కాలాకాశబంధవిమోచన మొందినపుడు తనపరిమితిని గుర్తించుటెట్లు ? గుర్తించి దుఃఖించు టెట్లు ? రెండును దుష్కరములే !

ఇక, చైతన్యరహితంగానో, జీవసంబంధమగు చైతన్యానికి అన్యమగు చైతన్యంతోనో, జీవాత్మ ఉత్తరజీవనం గడపవచ్చును. చైతన్యరహితమైన ఉత్తరజీవనమే సాధ్యమైతే, పరలోక సుఖ దుఃఖానుభవసందర్భంలో అది ఆత్మయొక్క వినాశానికే తుల్యమౌతుంది. అట్టి విషయంలో మృత్యువంటే భీతిల్ల నవసరంలేదు. శరీరం విచ్ఛిన్నమైపోతుంది కాబట్టి శరీరం బాధింపబడలేదు. సుఖదుఃఖ జనకమగు శరీరంనుండి విడిపోయిన మనస్సు అనంతాకాశ గాంభీర్యంలో నిర్వాణ మొందుతుంది ; జీవాత్మ పరమ సుషుప్తిని, శాంతిని పొందుతుంది అని వాదించవచ్చును. దీనికి పూర్వపక్షం