పుట:Jagattu-Jiivamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగత్తు

11

చతురపరికరాలతో, అద్భుతమైన గణితసాహాయ్యంతో అగోచరమైన ఈసూక్ష్మకణాలని లెక్కించి, తూచి, వాటి పరిమాణం కనుగొన్నారు ; సూక్ష్మాకాశంలో ఎలక్ట్రానుగ్రహాల చలనాలుకట్టేరు ; వాటిశక్తి ప్రసారవిధానం, సామర్ధ్యం కనుగొన్నారు. సూక్ష్మాకాశంలో అవి నక్షత్రాలట్లు ప్రవర్తిస్తున్నాయి.

ఏమంటే, ఈ సూక్ష్మకణ సమూహాలచిత్రాలను ఎన్నోరెట్లు విస్తరింపచేస్తే నెబ్యులాల చిత్రాలట్లేఉంటాయి. కొన్ని లక్షలమైళ్ల వ్యాసంగల సూర్యుని కబళించగల విపరీతగోళాలచిత్రాలు, సూది మొనలో కోట్లకొలది ఇమిడిపోవు సూక్ష్మకణాలచిత్రాలు : ఒకదాని ప్రక్క నొకటిపెట్టగా ఏచిత్రం దేనిదోచెప్పుట కవకాశం ఉండదు. బృహత్ప్రపంచానికి సూక్ష్మప్రపంచానికి అంత సారూప్యం ఉంది.

ఇందులో ధీరుడెవడు ? సూక్ష్మతమమైన ఎలక్ట్రాను పరమాణువులా ? బృహత్తమమైన నక్షత్రమా ? లేక, విశ్వాన్ని ఇంతగా శోధించి విశ్వచరిత్ర లిఖిస్తూన్న మానవుడా ? ఎడ్డింగ్‌టను లెక్క ప్రకారంగా 1027 పరమాణువులుకలిసి మానవశరీరం ఏర్పడగలదు; 1028 మానవశరీరాలలోని ద్రవ్యంతో ఒకనక్షత్రం ఏర్పడగలదు; విశ్వంలో బృహత్తమానికి సూక్ష్మతమానికి మధ్యనున్నాడు మానవుడు. ఇరువైపులా దృష్టిసారించి విశ్వనాటకం విలోకిస్తున్నాడు. మానవుడే ధీరుడేమో !