పుట:Gurujadalu.pdf/575

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



నాలుగు రోజులు పోయిన తరువాత, శాస్తులు గారు క్లాసులో యిలా శలవిచ్చారు. “ఒరే యీ పుస్తకం చదివిందాకా, బుద్ధుడి మహిమ నాకు తెలియలేదురా. తప్పకుండా యీ మహానుభావుడు శ్రీ మహావిష్ణు అవతారవేన్రా”

ఆనాటనుంచీ శాస్తుల్లు గారు మమ్మలిని బౌద్దులని దూషించడం మానేశారు.

కిరాస్తానులమని మట్టుకు అంటూ వచ్చారు. క్రీస్తును, శ్రీ మహావిష్ణు యొక్క పదకొండవ అవతారంగా చెయ్యడం సాధ్యం కాక, వొడబడి వూరుకున్నాం.

మా గురువు గారి వంటి గురువులు లోకంలో లేరు. చిరకాలం కాశీవాసం చేసి తర్కశాస్త్రము చదువుకున్నారు. మన దేశంలో అంత తార్కికుడు లేడని ప్రతీతి. శాస్త్రం మాటకేం గాని, కావ్యాల్లో మంచి రసగ్రాహి. మరి సుగుణ సంపత్తికో అంటే, సత్యకాలపు మనిషి అన్నప్పుడు, ఆయనే సత్యకాలపు మనిషి. అంత పాండిత్యం యింత సత్యకాలం ఒక్క బుఱ్ఱలో యెలా యిమిడి వున్నాయో, ఆశ్చర్యం!.

యీ జరిగినది పది సంవత్సరముల కిందటి మాట. ఇప్పుడు శాస్తుల్లు గారు పించను పుచ్చుకున్నారు. మాలాటి శిష్యుల శుశ్రూష పొందుతూ, మాకు సంస్కృత గ్రంథాలు చెబుతూ, సంతోషిస్తూ, సంతోషపెడుతూ, కాలం వెళ్ళబుచ్చుతున్నారు.

నేను వర్తకం చేస్తున్నాను. రామ్మూర్తికి భూములు లావుగా వున్నాయి. కొత్త కొత్త మోస్తర్లను వ్యవసాయం చేస్తున్నాడు. వూట గెడ్డ దరిని సీతారామ కోరుతున్న ఒక బ్రహ్మాండమయిన తోట వేశాడు. అవి పువ్వులు కావు. అవి పళ్ళు కావు. తొలి ఫలాలు గురువుగారు ఆరగించనిదీ రామ్మూర్తి చెట్టు ముట్టడు. ఆ తోటలో విహరించడం గురువు గారికి అత్యానందం. అక్కడనే మేం తరుచు మీటింగులు చేస్తూ వుంటాం. వెంకయ్య స్కూలులో మేష్టరు. ఖాయిదా లావుచేసి, తిట్లు తింటూ వుంటాడు. మా స్కూలు జట్టులో ఆరేడుగురం యిక్కడనే వున్నాం. గురువు గారూ మేమూ కలసినప్పుడల్లా స్వర్గఖండం ఒకటి అక్కడికి దిగినట్లు వుంటుంది.

యిక ప్రస్తుత కథా -

మా పట్నానికి యెనిమిది మైళ్ళ దూరంలో రామగిరి అని ఒక విష్ణుక్షేత్రం గలదు. దాని వర్ణన మరి వక మాటు చేస్తాను. ఇప్పటి మట్టుకు మీకు తెలియవలసిన దేమంటే- అక్కడి విష్ణుక్షేత్రం ఆధునికం. ఆ వూరి నల్ల కొండల నంతటను శిధిలమైన బౌద్ధ కట్టడములు కలవు. అక్కడి వారు వాటిని పాండవుల పంచలంటారు. ఈ దేశంలో పాండవులు వుండని గుహలూ, సీతామ్మవారు స్నానమాడని గుంటలూ లేవు.

గురుజాడలు

530

మీ పేరిమిటి?