పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

గోన గన్నా రెడ్డి

గ్రహిస్తే గ్రహించినవాడుగాక. తన స్త్రీజన్మ ఈనాటికి సార్థకమయింది. వెన్నెల ఉండి ఆకాశాన చంద్రుడు లేకుండుట ఎట్లు సాధ్యము?

తన్నుచూచి ఆ ప్రభువు ఆ ఉత్తమనాయకుడు విగ్రహమైఅలా నిలుచుండి పోయినాడు! ఈ వెన్నెల కూడుకొన పాలరాయై, ఈ ఉత్తమ చాళుక్యుడైనది కాబోలు?

ఇంతలో రుద్రదేవికి ఏదియో సిగ్గు, ఏదియో మహాకాంక్ష, ఏదియో అతిపూజాభావము కెరటాలై నిలువునా విరుచుకొనిపడినాయి.

ఈ మహాపురుషుని పాదాలకడ మోకరించి, “ప్రభూ! నేను నీ దాసిని, నీ భార్యను, నీ ప్రేయసిని, నీ అర్ధాంగిని. నన్ను పాలించుకో. న న్నీ రాజ్యపాలనాభారంనుండి శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకుపోయినట్లు ఎత్తుకుపో. నువ్వు పురుషుడవు. నేను స్త్రీని. నీకు నేను, నాకు నీవు! గోదావరీతీరంలో ఒక చిన్న ఆశ్రమం నిర్మించుకొని, ప్రేమతో, ప్రేమశ్రుతితో, ప్రేమరాగాలతో, ప్రేమగీతాలతో ఆ గోదావరీతరంగాల ఉయ్యాల లూగుతూ, ప్రవహిస్తూ, సర్వ ప్రకృతిలో భాగమై, కోకిలలతో కొమ్మకొమ్మకూ ఎగురుతూ, జక్కవజంటతో నీరరేఖలలో సుడులౌతూ, రెండుపూవులులా, రెండు లేత రెమ్మలులా, లోకానికి దూరంగా, లోక ప్రేమనవనీతంలో కణాలవుతూ ప్రేమోపనిషన్మంత్రంలో మంత్రవ్యాఖ్యానాలవుతూ తరింపకూడదా ప్రభూ!” అని తన్నర్పించుకుందామని రుద్రదేవి అనుకొన్నది.

ఎంత ఉత్తమమైనా, స్త్రీ పురుష ప్రేమ, వ్యక్తి మాత్ర సంబంధంకలది. ప్రేమికులు లోకంలో ఇద్దరే. వారి కింక ఏమి ఉంది? లోకం ఏమవుతుంది? తల్లి దండ్రులులేని బిడ్డలు, భర్తలులేని భార్యలు, వికలాంగులై, తమ్ముపోషించుకోలేని పురుషులు, రోగపీడితులైన నరులు, జరాదుఃఖితులై అసహాయులైన మానవులు, క్రూరులచే హింసించబడే సాధువులు, క్షామదేవత పాదాల నలిగిపోయే జనులు, కోటానుకోట్ల జనులు, వారి చిన్న చిన్న గ్రామాలు, వారివృత్తులు వారి వ్యవసాయాలు, వారి ఆనందాలు, శాంత ప్రవాహాలైన వారి జీవితాలు ఇవి అన్నీ ధర్మం నెరవేర్చడానికి భయపడే ప్రభువువల్ల వంచితమై అపశ్రుతిస్వరూపమై ప్రళయంలో మగ్గిపోవునుకదా!

అలాంటి హీనరాజశాబకం తాను కాదనుకోడం ఎంత అధర్మము, ఎంత నీరస సవిర్వేదము! మహాధన్వి అయిన అర్జునుడు ఆ మహాదోషం ఆచరింపబోతే భగవానుడు శ్రీకృష్ణు డాతనిని రక్షించాడు. తన్నెవ్వ రిక్కడ రక్షించేది? తానే తనకు శ్రీకృష్ణుడౌనుగాక!

ఆమె వెనక్కు తిరిగి, ఆ వెన్నెలలో ఆ వసంతయానినీవికాసంలో, ఆ మత్తపుష్పసౌరభాలలో, అ శకుంతకలకలారావగాఢగీతికలలో అన్నికలలూ అక్కడే దిగజార్చి, కఠిన ధర్మాభిముఖయై పరుగెత్తి పోయింది.

• • •