శివదేవయ్య
283
ఆంధ్రసైన్యాలలో మృత్యులైనవారు, గాయాలు పడినవారు, విరోధులకు చిక్కినవారున్నూ ముప్పదివేలు.
యాదవమహారాజు గుండెలలో రాయిపడింది.
కోటపైకి వెళ్ళకుండాఉంటే తనకు నష్టమే! కోటపైకి వెళ్ళినచో తన సేనలకే నష్టం ఎక్కువ సంభవిస్తోంది. ఎలాగో ఉత్తమమైన విధానం అవలంబించి ఆంధ్రనగరం స్వాధీనం చేసుకోవాలి.
తాను కోట ముట్టడి వదలి ఇతర నగరాలమీదికి వెళ్ళితే మంచిదేమో? కోటలోఉన్న ఆంధ్రులకు బలం ఎక్కువ అవుతున్నది. కోట ఈవలకు వచ్చిన ఆంధ్రులను యాదవులు నాశనం చేయగలరు.
అయినా తా నెందుకు తొందరపడడం? చుట్టుప్రక్కల గ్రామాలవారంతా ఓరుగల్లుమహాపురంలోనే ఉన్నారని తనకువచ్చిన వార్తలే నిజమైతే నగరంలో పదునాలుగులక్షల జనం ఉన్నారు. ముట్టడి నిలబాటుచేసినట్లయితే ఇన్ని లక్షల మందీ, ఉన్న ఆహారపదార్థాలను ఒక నెలదినాలలో తినివేయగలరు. జాగ్రత్తగా ఉంటే ఇంకొక్క పదిహేను దినాలపాటు ఈడ్చుకురాగలరు. అంతవరకు తాను ముట్టడి నిలబాటు చేయగలిగితే, కోట తన స్వాధీనం అయి తీరుతుంది.
తనకు ఆంధ్రుల యుద్దవిధానం యావత్తు విశదమైపోయింది. అందుకని తొందరపడక తనశక్తి ఆంధ్రులకు తెల్లమయ్యేటట్లు చేస్తాడుగాక, అనుకొనుచు మహాదేవరాజు, ఆ రాత్రి పనివారలచేత తన కోటగోడలు, బురుజులు బాగుచేయించాడు. వెనుకనుండి మల్యాలవారి సైన్యాలు, గోన గన్నారెడ్డి సైన్యాలు తన్ను పొడువకుండా ఆవైపు చిరుకందకాలు, కంపకోటలురెండు శ్రేణులుగా కట్టించాడు. తాను ముట్టడి నిలబాటు చేయదలచుకున్నాడు.
ఈ లోగా వేగులవారిని పంపి దేవగిరిలో ఉంచిన లక్షసైన్యంలో ఏబది వేలమందిని, ఆహారపదార్థములు తెప్పించుకొన సంకల్పించాడు.
కోటలోను, గన్నారెడ్డి శిబిరంలోను తమ మొదటివిజయానికి ఆంధ్రులు విజయోత్సవం చేసుకున్నారు. గన్నారెడ్డి తనతో సమముగా యుద్ధముచేసిన విశాలాక్ష ప్రభువును చూచి ‘విశాలాక్షప్రభూ! నువ్వు నాకు కుడిచేయివి సుమా’ అని మెచ్చుకొన్నాడు. విశాలాక్షప్రభువు మోము ప్రపుల్లమై వెలిగిపోయినది. ‘మహారాజా! మీకు కుడిచేయినిగాను. మీ పాదాలమ్రోల ఉండడమునకు శక్తిమాత్రం సంపాదించుకొంటున్నాను’ అనినాడు.
గోన: ప్రభూ! మీరు, యుద్ధంచేసే సమయంలో సర్వకాలమూ నా రక్షణకొరకే చూస్తే ఎలాగు?
విశా: లేకపోతే మీకు అంగరక్షకుణ్ణి ఎల్లా కాగలను?