పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవమగాథ

ఉత్తమచాళుక్యుడు

1

ఉత్తమ చాళుక్యుడైన వీరభద్రమహారాజు శ్రీ శివదేవయ్య దేశికుల ఆజ్ఞచే ఓరుగల్లులో ఉండిపోవలసి వచ్చినది. రుద్రచక్రవర్తి ఓరుగల్లుకోట బాగుచేయించే ముఖ్యకార్యమున కై వారిని నియోగించిరి.

ఆ మహారాజు ఒక్కక్షణికమేని విశ్రాంతి ఎరుగక నిరంతర కృషిలో మునిగిపోయినాడు. ఓరుగల్లు దుర్గసంరక్షణ కాకతీయ మహాసామ్రాజ్యానికి మూలస్తంభము. ఆంధ్రక్షత్రియవంశాలు తన ప్రాణాలేని ఒడ్డి ఆ కోట కాపాడవలసినదే!

యుద్ధవ్యూహరచనావిధానమునుగూర్చి, దుర్గసంరక్షణగూర్చి సమాలోచించుటకు రుద్రదేవి, శివదేవయ్యమంత్రి, చాళుక్య వీరభద్రుడు, ప్రసాదాదిత్యనాయకులు, జాయపసేనాని, పడికము బాప్పదేవులు రహస్యాలోచన మందిరంలో కూడినారు.

యాదవ మహాదేవరాజు ఓరుగల్లుపై ఎత్తివచ్చుటకు సర్వసన్నాహాలు చేయుచున్నట్లు ఏదినాని కాదినము వేగు వచ్చుచున్నది.

రుద్రదేవి సింహాసనముమీద, తక్కినవారు యధోచితాసనాలమీద అధివసించారు. అన్నాంబిక కూడా రుద్రదేవితోపాటు పురుషవేషముతో ఆమె ప్రక్కనే వేరొక పీఠముపై ఆసీన అయిఉన్నది. గొంకప్రభువు అప్పుడే వచ్చి చక్రవర్తికి, మహా మంత్రికి, పెద్దలకు నమస్కరించి ఆసనము నధివసించెను.

గొంకప్రభువు: మహాప్రభూ! మహాదేవరాజు జైత్రయాత్ర విజృంభించింది. అతడు గోదావరిని ప్రతిష్ఠానపురందగ్గర దాటి సర్వసైన్యాలతో నదీతీరంవెంటే వస్తున్నాడు.

శివదేవయ్య: నిన్నటి మీవార్త ఆయన గోదావరి దాటుతున్నాడనే కదా?

గొంక: అవునండీ. అది నాలుగుదినాల క్రిందటిమాట. ఇంక శంఖచారత్వము నడిపించి నిశ్చయం చేసుకొన్నాము.

చాళుక్య: నేను మా లక్ష సైన్యంతో వెళ్ళి మంజీరదాటకుండ మహాదేవుణ్ణి అరికట్టాలని ఉంది. మహామంత్రీ!