పుట:Geetha parichayam Total Book.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గీత అనగా గీయబడినది. ఎవరు గీచారు అని ప్రశ్నించుకుంటే, దేవుని చేత గీయబడినదని జవాబు తెలియుచున్నది. దేవుడు కనిపించేవాడు కాదు, ఆయన ఎట్లు గీచాడు అని ప్రశ్నరావచ్చును. దానికి జవాబు ఏమనగా! శరీరములోని జీవుడు కూడ కనిపించడములేదు. అయినప్పటికి మన శరీరములో కనిపించని మనము (జీవులము) శరీరమునకున్న హస్తము ద్వార గీతలు గీయుచున్నాము కదా! అలాగే కనిపించని దేవుడు ప్రకృతి అను తన శరీరముతో గీత గీచాడు, అని నీవు ఎందుకు అనుకోకూడదు? ఇపుడు మరియొక ప్రశ్న రాగలదు. జీవుడు కనిపించలేదు, దేవుడు కూడ కనిపించలేదు. అయినను కనిపించే శరీరముతో గీచిన గీత కనిపిస్తుంది కదా! అలాగే కనిపించే ప్రకృతితో గీచిన గీత కనిపించాలి కదా! అలా ఎక్కడ కనిపించలేదే అని ప్రశ్నించవచ్చును. తెలివైన వారికి మరొక విధముగ యోచనవచ్చి, కృష్ణుడు కూడా మనలాంటి శరీరమున్న మనిషే, అతని శరీరము ద్వార వచ్చిన గీత పుస్తకరూపములో ఉన్నది. దేవుడు మనలాంటి మనిషి కాకున్నా ప్రకృతి అను అతని శరీరము ద్వార వచ్చిన గీత ఏ రూపములోను కనిపించలేదే అని ప్రశ్నించవచ్చును. ఈ ప్రశ్నకు జవాబేమిటో, ఏ విధముగ అర్థము చేసుకోవాలో క్రింద చూస్తాము.

శ్రీకృష్ణునిచే గీయబడిన భగవద్గీత అను పుస్తకము కొందరి వద్ద ఉండవచ్చును, కొందరి వద్ద లేకుండపోవచ్చును. దేవునిచే గీయబడిన గీత ప్రతి ఒక్కరివద్ద గలదు. మానవులవద్దేకాక, సమస్త జీవరాసులవద్ద కూడ కలదు. దేవుడు గీచిన గీత లేక హద్దు జీవుడైన నిన్ను వదలి లేదు. ఆ గీత ఎప్పటికి నిన్ను అంటిపెట్టుకొని ఉన్నది. దేవుడు గీచిన హద్దు ఏదో తర్వాత పేజీ పటములో చూడుము.

భూమి విూద ఎన్నో దేశాలు కలవు. ప్రతి దేశమునకు ఆ దేశము యొక్క సరిహద్దు రేఖ ఉండును. సరిహద్దు రేఖ లోపలయుండునది పలానా దేశమనియో, ఫలానా రాజ్యమనియో చెప్పుచుందుము. ఈ పద్ధతి ప్రకారము భారత దేశమునకు చుట్టు ఒక హద్దు కలదు. అలాగే ప్రపంచములో ఎన్నో