పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూర్చుండి యుండెను. పెదవి తడుముకొనగా అతనికి తేనె పెదవుల నంటుకొని యుండెను. అందువలన అది కల కాదు. ఆనాటి నుండి అతని బుద్ధి యందు సూక్ష్మత్వము, కవిత్వము నందు మాధుర్యము అతిశయించెను. నాల్గు మాసములు అక్కడనే అతడు తపస్సును కొనసాగించెను.

14 - 2 - 1899 తేది విశాలక్షమ్మ పుత్రుని గనెనని యుత్తరము వచ్చినంతనే బయలుదేరి గణపతి విరజాపుర మందు కొంత కాలము తపస్సు చేసి కలువఱాయి చేరెను. కుటుంబ పోషణకు ఉద్యోగ ప్రయత్నము చేయుచు గణపతి పర్యటించుచు కేశినకొఱ్ఱు అగ్రహారమున ఒక పండితుని యొద్ద రెండు మాసములలో తర్క వేదాంత శాస్త్రములను పఠించెను. తరువాత నతడు కలువఱాయికి వచ్చి మూడు నాలుగు మాసములలో వ్యాకరణ మహాభాష్యమును నీతి శాస్త్రాది గ్రంథములను పఠించెను.

1900 వ సంవత్సరమున ఉగాదికి గణపతి మందసా సంస్థానాధిపతిని దర్శించి అష్టావధానము గావించెను. అచ్చట రాజ గురువును వాదమున జయించి రాజకుమారునకు శివపంచాక్షరి నుపదేశించి కొన్ని నెల లుండెను. ఇంతలో నవద్వీప మందు విద్వత్పరీక్షలు జరుగబోవుచున్నవను వార్త వచ్చెను. రాజు ప్రోత్సహింపగా గణపతి నవద్వీపమునకు చేరెను. అచ్చట నతడు శివకుమార పండితుడు ఇచ్చిన పరిచయ లేఖ వలన కార్యదర్శి యైన శితికంఠ వాచస్పతి యొక్క ఆదరమునకు పాత్రుడై అతని యింటనే బస చేసెను.