పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఓం నమో భగవతే శ్రీ రమణాయ"

"ఇంద్రో విశ్వస్య రాజతి"

1. అవతరణము

స్వధర్మము కొఱకు స్వరాజ్యము కావలెనని 1857 లో భారతీయులు బ్రిటిషు ప్రభుత్వముపై తిరుగుబాటు చేసిరి. అది విఫల మయ్యెను. తిరుగుబాటు దారులను శిక్షించు నెపముతో బ్రిటిషువారు ప్రజలను పెక్కు విధముల హింసింప జొచ్చిరి. స్వరాజ్యము నెట్లయినను సంపాదించవలెనని అప్పుడు ఆసేతు హిమాచలముగా అనేకులు భావించు చుండిరి. ఆ గాఢ భావమునకు ఫలముగా వారి సంతతిగా దేశమందంతటను ఎందరో మహానుభావులు రాజకీయ ధార్మిక విద్యా రంగములలో ఉదయించి భారత దేశము నుద్ధరింప యత్నించిరి. అట్టి ధార్మిక వీరులలో ఎన్నదగినవాడు శ్రీ కావ్యకంఠ గణపతి ముని.

విశాఖపట్టణ మండలమున బొబ్బిలికి ఆరు మైళ్ళలో కలువఱాయి అను గ్రామము కలదు. ఇందు "నవాబు అయ్యల సోమయాజుల" అను నింటి పేరుగల బ్రాహ్మణ కుటుంబము ఆ ప్రాంతమున ప్రఖ్యాతమై యుండెను. వీరు ఋగ్వేదులు; కౌండిన్యస గోత్రులు. సంస్కృతమున జానకీ పరిణయ మను నాటకము రచించిన రామభద్ర దీక్షితుడు ఈ వంశములోని వాడే. ఈ వంశమున జగన్నాథ శాస్త్రికి మామగారి వలన కలువఱాయి