8
దినచర్య
కొన్ని జీవితవిశేషాలు
దినచర్య రాయడం నరసయ్య నిత్యకృత్యంలో భాగం. ఆనాటి విద్యావంతులు - వీరేశలింగం, గురజాడ మొదలైనవారు దినచర్య రాశారు. నరసయ్య గంటగంటకు తాను చేసిన పనులన్నీ దినచర్యలో పేర్కొనేవాడు. చదివిన పుస్తకాలు, పత్రికలు గుర్తుగా రాసిపెట్టేవాడు. తనకు తారసపడిన ప్రతివ్యక్తి వివరాలు గుర్తుంచుకొని దినచర్యలోకి ఎక్కించేవాడు. విలేజి పోస్టుమాన్, బండివాడు, కూలీలు, అందరి వివరాలు దినచర్యలో రాసేవాడు. ప్రకృతిలో వచ్చే మార్పులు, రాత్రివర్షం కురిసిన సంగతి, అనారోగ్యంవల్ల నిద్రపట్టకపోవడం, భార్య 'పవిత్రస్నానం' అన్నీ ఆయన దినచర్యలో చోటు చేసుకొన్నాయి.
1896, 1901 నరసయ్య దినచర్యలను పెన్నేపల్లి గోపాలకృష్ణ తన వ్యాసాలలో ప్రస్తావించాడు. 1896లో పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక కొనసాగుతూనే ఉంది. 1901 దినచర్యలో ఆంధ్రభాషా గ్రామవర్తమానికి సంబంధించిన ప్రస్తావన ఉన్న కొన్నివాక్యాలను ఆయన ఉదాహరించాడు. ఈ రెండు దినచర్యలు ఇప్పుడు లభించడంలేదు. ఆ విధంగా ఎంతో విలువైన సమాచారం కనుమరుగైంది.