గురు శిష్య ప్రశ్నోత్తరములు
955
గురు : లోకమును మెప్పించఁగలమా? యేమి?
శిష్యు : మెప్పించినా మెప్పించకపోయినా, కవి లోకంకోసమే పుట్టడం వల్ల వీలిచ్చినంతలో లోకాన్ని మఱవఁగూడదు.
గురు : సరే? యీ ప్రశ్నోత్తరాలవలన చెరలాటములోని సంగతి సందర్భాలుచాల వఱకు తేలినట్లయిన దనుకొందును.
శిష్యు : అబ్బో? యెక్కడ తేలేయి, యింకా. తిరుపతిశాస్త్రి ప్రభాకరశాస్త్రి ద్వారా కబురంపడం వగయిరాలున్నూ "భగవంతుఁడు రక్షించుగాక శిక్షించుగాక” లున్నూ దేవునిముఖం చూచి వ్రాయడాలున్నూ వున్నాయి.
గురు : నీవు దేవుని తలపెట్టుట కంగీకరింప వనుకొందును.
శిష్యు : అంగీకరింప కేమి, వ్రాసేవి అంతో యింతో అసత్యంగా కనపడుతూన్నప్పుడు అట్టిమాటలు అపహాస్యాస్పదంగా వుంటాయని నేను జంకుతాను.
గురు : నీవు జంకు టట్లుంచు, ఇతరులు జంకినట్టు కూడా ప్రకటింప సాహసించెదవు “ఆత్మవత్సర్వభూతాని" కదా?
శిష్యు : (తనలో) యిదేమిటిచెప్మా? (ప్రకా) యిదా? శృంఖలాన్ని ప్రకటించడానికి తాము జంకారని నేను వ్రాశానని యెత్తి పొడుస్తూ వున్నారు గురువుగారు.
గురు : బాగుగా గ్రహించినావు. అలాటి జంకులు, గింకులు నాకు లేవు సుమా? ఏమనుకొన్నావో? నీవు. నేఁట రేపట దానిని ప్రకటించెదను చూడు.
శిష్యు : తమచిత్తానికి నేనెవణ్ణి గాని దాన్ని మాత్రం ప్రకటించకండి.
గురు : కాశీపండితులు లోనగువారు పలువురు దానిమీఁద సదభిప్రాయాలిచ్చిన దెఱుఁగ వనుకొందును.
శిష్యు : చెరలాటంలో, తమరు, నవద్వీపం, కలకత్తా, వగయిరాగ్రామాలు చాలా యేకరువుపెట్టేరు. చూచే వున్నాను. నాకు దొరికినప్రతిని బట్టి చూస్తే అది తెలుఁగులో వుంది. అభిప్రాయా లిచ్చినపండితులుండే మావూళ్లల్లో చాలాచోట్ల తెలుఁగున్నట్లే లేదు.
గురు : తెలుఁగే యున్నదో? సంస్కృతమే యున్నదో? అంతయుఁ దెలియ నయ్యోడిని. ప్రకటించుచున్నాఁడను గదా?