852
కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
క. ఇఁక నొక విశేష మలపు
స్తకమది తమపేరఁ బ్రకటితంబగు నేనిన్
బ్రకటింపక నా హృదయం
బకలంకచరిత్రు నతని నావలి కనుతున్.
తే.గీ. అట్లు గాకున్న కతన నాకెట్లు దప్పి
కొనఁగ వీలీక యందలి గుణవిహీన
భావ మన్యపండితులతోపాటు స్పష్ట
పఱచినాఁడ, దురుద్ధరప్రతిభ మెఱయ.
ఆ.వె. దానిఁగాని దానితోనున్న యితర పం
డితులవ్రాఁత గాని ఋతమయంబ
యగుటఁ ద్రోచిపుచ్చ నలవిగామి యెఱింగి
కూడఁ గోప మాఁపికొనఁగరాక.
విస్తరము ప్రకటించిన తర్వాత దానియందే చూస్తారుగదా. నాతో పాటు అభిప్రాయ మిచ్చిన పండితవరేణ్యుల నామము లిక్కడ వుదాహరించడం మంచిదనుకుంటాను (1) బ్ర|| శ్రీ|| శ్రీపాద లక్ష్మీనరసింహశాస్త్రులవారు, శ్రీ పిఠాపుర సంస్థాన విద్వాంసులు. (2) బ్ర|| శ్రీ|| వేదుల సూర్యనారాయణశాస్త్రులవారు, శ్రీ పిఠాపుర సంస్థాన విద్వాంసులు. (3) బ్ర|| శ్రీ|| ఓలేటి వేంకటరామశాస్త్రులుగారు, పీఠికాపుర సంస్థాన కవీశ్వరులు. (4) శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావుపంతులుగారు - డిటో, (5) శ్రీయుత వడ్డాది సుబ్బారాయకవిగారు, కవిశేఖర బిరుదాంకితులు. (6) శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహ కవిగారు, డాక్టరు బిరుదాంకితులు. (7) బ్ర|| శ్రీ|| కాశిభట్ల బ్రహ్మయ్యశాస్త్రులుగారు, విమర్శకాగ్రేసరులు. (8) చిలుకూరి సోమనాథశాస్త్రులుగారు, తుని సంస్థానం విద్వాంసులు. (9) దువ్వూరి నాగేశ్వరశాస్త్రుల వారు. యింకా మఱికొందఱు పెద్దలూ పిన్నలూ అభిప్రాయముల నిచ్చియున్నారు. విస్తర భీతిచేత వుదాహరించడం లేదు. ఆయీ వుదాహరించిన పండితులలో కొందఱిపేరు విన్నంత మాత్రాన్ని యెవరికైనా భయం పుట్టి తీరాలి. అట్టి సందర్భంలో మా గురువుగారి ధైర్యమేమో నాకు గోచరించడం లేదుగాని, వీరి వ్రాఁతను ఖండించడానికి పూనుకున్నారు. ఖండించారు. అంతేకాకుండా వారి వారిని పూర్తిగా తృణీకరించారు. అచ్చొత్తించారు. తుదకు యేంతోcచిందో ప్రకటించడం మాత్రం మానేశారు. మంచిపని చేశారని నేననుకున్నాను. సంతోషించాను. ఆ పుస్తకం పేరే “దురుద్ధరదోషశృంఖలం". అదే నాకు గుంటూరిలో దొరికింది. యితరులను గూర్చి