అష్టావధానమంటే!
817
అని ఆరోగ్యకామేశ్వరిలో నేనే వ్రాశాను. ఇవన్నీ ఈలా వుండగా పైకినొచ్చకుండానే పెంకెఘటాల నోరుకట్టడానికితగ్గ వకవిధమైన నిరుపమానమైన పెంకెతనం వుండాలి. ఎంతపండితుణ్ణైనప్పటికి బోల్తా కొట్టించే వుపాయాలు వండాలి. ఉదాహరణకి ఆ వుపాయం వకటి చూపుతాను చిత్తగించండి. వకాయన అవధానం చేస్తూన్నాడు, వక పృచ్ఛకుడు సంస్కృతంలో పృథ్వీవృత్తంలో లక్ష్మీదేవిని వర్ణించమని కోరి కూర్చున్నాడు. అంతలో హఠాత్తుగా మెఱుపు మెఱిసినట్లు అవధానికి వక్రబుద్ధి పుట్టింది. ఈవర్ణనలో వక చమత్కారంజేసి అందఱినీ బొందలోపడదోయాలని, ఆపట్లానచెప్పడానికి మొదలెట్టాడు ఏ విధంగా? ఈ విధంగా? “సరోజనిలయాం సరోజనికరాం" ఇది పృథ్వీవృత్తపాదం కాదు, కాబట్టి కోరిన పృచ్ఛకుడన్నాడు గదా? బావా? వృత్తం తప్పిందన్నాడు. అవధాని తప్పితే తప్పిందిలే వ్రాయిబావా అన్నాడు. దాని మీద ఇంకోకవి బావమఱది వరసవాడే అదేంమాట? దిద్దిచెప్పమన్నాడు. అవధాని నేను దిద్దేదిలేదన్నాడు. పిమ్మట, తోడి అవధాని అన్నాడు కదా? అదేమిటోయి పాదంలోపొరపాటు కనపడుతోంది. దిద్దమన్నాడు. కావలిస్తే రెండో చరణంలో నీవు దిద్దుకోమని అవధాని సహాధ్యాయికి జవాబు చెప్పాడు. అంతట్లో తనతో సమానమైన శిష్యుడు లేచి "ఇదే మిటండోయి, తప్పిందన్నప్పుడు దిద్దకపోవడం' అన్నాడు. దిద్దేదిలేదని ముట్టితోపు జవాబే చెప్పాడు. సభ్యులు ఇదేమిట్రోయి వీళ్లలోవీళ్లకే పడ్డదని నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఇక్కడికి సభంతా గొల్లలై నట్లయిందని అవధాని గ్రహించి పృచ్చకుణ్ణి ఉద్దేశించి వ్రాసుకొమ్మని “వరాంభాస్వరాం” అని ఉఱిమేడు. ఇది తగల్చడంతోటే ఆపాదం పృథ్వీవృత్తపాదం అయింది. తప్పిందన్నవారంతా వెలవెల పోయారు. ఇక వీడు, రాముడనడానికి బదులు రీముడన్నా చెల్లిపోతుందా? చెల్లదా? చెప్పండి. ఈ శిరోమణిగారి వంటివారే ఆసభలో వుంటే పై తప్పు విషయంలో వీరుకూడా భాగస్థులవుతారో లేదో ఆలోచించండి. ఇట్టి స్థితిలో చూడండి వీరెల్లావ్రాశారో? “సత్యకవిగారు ఫస్టురౌండైన పిదప సెకండు రౌండున అర్ధము చెప్పదుము" అని సెలవిచ్చిరి. శుద్దాంధ్రమునే వుపయోగింతుమని చెప్పి యీ ఇంగ్లీషు పదప్రయోగ మెందులకో, దీని అర్ధమేదియో? నాకవగతము కాలేదనియు సెలవిచ్చిరి". ఈ సెలవిచ్చిన వారొక వెలమదొరగారు. ఈ దొరగారి అభిప్రాయము చొప్పున తెలుగులో అవధాన కవిత్వము చెప్పెదమని కూర్చున్న అవధానుల నోట కవిత్వంలో కాక మామూలు మాటలలో కూడా ఇంగ్లీషుగాని వేరొక భాషగాని దొరలకూడదని వుండిన వుండుగాక, ఈ ప్రేక్షకుడుగా రదిసరియైనదని యెట్లతలచి బోలెడు వాక్కులను ఖర్చుపెట్టిరో? ఏ ప్రభువుల కాలములో