760
కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
శాసించినమాట సత్యం. ఆ శాసనం ఆనకట్టకు పూర్వం అమలు జరిగింది కాని యీ యిరవయ్యో శతాబ్దానికి పనికిరాదని పలువురు యువకవులు కట్టుకట్టి పనిచేస్తున్నారు.
శబ్దం బ్రహ్మస్వరూప మనిన్నీ దాన్ని సుస్వరంగానూ నిర్దుష్టంగానూ వుచ్చరించినప్పుడే అది పుణ్యజనక మవుతుంది గాని అన్యథాగా వ్యవహరిస్తే యేదో కొంపములక్కి కారణంగా పరిణమిస్తుందని - పూర్వాచార్యుల శాసనం. ఆ యీ శాసనా లన్నీ యిప్పుడు అకించిత్కరాలుగా బుట్టదాఖలవుతూ వున్నాయి. పూర్వపండితుల చర్యలూ, వారిప్రతిజ్ఞలూ తల్చుకుంటే యిప్పటివాళ్ల విశృంఖలత్వం యేదోవిధంగా పరిణమించినట్లు కనపడుతుంది. ఆ పండితరాయలు, ఆ వేదాంత దేశికులు, ఆప్రతిజ్ఞలు యిప్పటివాళ్లకు రుచించవు సరిగదా, అవి తమకు మర్యాదభంజకాలని కూడా విచారపడతారు.
"వాచా మాచార్యతాయాః
పద మనుభవితుం కో౽స్తి ధన్యో మదన్యః"
ఆ యీ శ్లోకం చాలా పెద్దది. పండితరాయలవారిది యీగర్జితం. “ఆసేతుహిమాచల పర్యంతమూ వున్న పండిత మండలిని నేను ప్రశ్నిస్తున్నాను : వాక్పతిఅనే పేరుకు యీభూలోకంలో నేనుతప్ప మఱొకఁడు వున్నాఁడా? వున్నట్టయితే, విశంకం వదంతు” అనిగర్ణించాఁడు పండిత రాయలు. (ఘనులు పండితరాయాదికవులు చూపు త్రోవలంబట్టి పోదుము దేవునైన లక్ష్యపెట్టము. చూ.) యేదో ఆగర్జించడానికి అవసరం వచ్చింది కనకనే అతఁడటుల గర్జించాఁడుగాని తీరి కూర్చుని గర్జించలేదు. పండిత రాయలు వేఁగినాటి బ్రాహ్మఁడు. వెల్నాటిశాఖవారు ఆ యీ గర్జింపు మా పూర్వులకు అవమానకరం అని విచారిస్తే యేం ప్రయోజనం? ఆ పండితరాయలకు సమకాలీనులుగా వుండే భట్టోజీ దీక్షితులు, అప్పయ్య దీక్షితులు వీరు ప్రతిఘటించికూడా వోడిపోయారు. అంతవఱకు అది పండితలక్షణమే కాని అన్యథా అతణ్ణి వంచించలేక ఆతఁడు లవంగి అనే తురుష్క కన్యకను పెండ్లిచేసుకున్నాఁడని మిషపెట్టి బహిష్కరించడం వగయిరాలు యీ కాలంలోనే అయితే శోచ్యం. అతఁడు నిరాఘాటమైన శక్తికలవాఁడు. కనకనే ఆకాలపు ఢిల్లీచక్రవర్తి (శహాజహాను) అతనికి పండితరాయలు అనే బిరుదాన్ని యిచ్చి గౌరవించాఁడు.
“దివిజకవివరు గుండియల్ దిగ్గురనఁగ
నరుగుచున్నాఁడు శ్రీనాథుఁ డమరపురికి"
దీని కర్థమేమిటి? యీలోకంలో వుండేకవుల నందఱినీ వోడించడమయిందనేనా? ఆ వోడించడం తనకన్నకొంత పూర్వకాలంలో వుండే కవిబ్రహ్మకున్ను చాలాపూర్వికుఁడైన