320
కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
తే.గీ. చెల్లబోదిఁక నీమాయ లెల్లఁదెలిసె
గామిడంబులు మాని చక్కంగ మసలు
వేగిరించుట పనిగాదు వినుము, చెంచు
వారికట్టడి బలుపెద్దతీరుసుమ్మ
చ. తొకతొకమానినీసవతి దోకొనివచ్చినయప్పుడూరకుం
డక యొకచాయఁ బెద్దగగలంబముఁ జేయవె? యవ్వ! యంతనుం
డిఁకఁ గడు మంచిబుద్ధిగని నిక్కము నిన్బతిమాలుకొంట మ
చ్చికదిరలాడకుంటె నను "సింగిహుళిక్కిది" యంచు నెంచుమీ.
తే, గీ. గామిడము సేసినాఁడవో కలిసికట్టు
సేసినాఁడవొ సామి! సెంచితయె నీకు
నిచ్చకమె పల్కిపానంబు లిచ్చినిల్పెఁ
గాకయుండిన నీమాటగానవచ్చు.
భిన్నభిన్న స్థలాలనుంచి ఉదాహరించిన పద్యాలవల్ల గ్రంథకర్త కవిత్వం చాలా ప్రసాదగుణవిశిష్టంగా వుంటుందనే కాకుండా జాతీయంగా కూడా వుంటుందని స్పష్టంగా తెలుస్తుంది. యమకానికేమి, చిత్రానికేమి, ఇంకా అనేక విధమైన త్రికమలకేమి, ఈయన పుట్టినిల్లే కనుక, ఆమోస్తరు పద్యా లుదాహరించి గ్రంథం పెంచలేదు.
కవిత్వం మావంశంలో ఈయన తరంలోనే పుట్టిందనుకోవడానికి వీలులేదుగాని, ప్రబంధరూపాన్ని తాల్చిందనిమాత్రం చెప్పక తప్పదు. ఈయనగద్యలో “కామకవిపుత్ర" అని వ్రాసుకోవడంవల్లనూ, "అశ్వత్థ నారాయణా" అనే మకుటంగల శతకం వకటి ఈయనకు పూర్వమందే మావంశస్టులు వ్రాసినట్లు ప్రతీతి వుండడంచేతనూ, ఈయనకన్న పూర్వం కూడా మావంశమందు కవిత్వం అంతోయింతో వుందనుకోక తప్పదు. పైశతకాన్ని గుఱించి మాతాతగారితో ఆయన మేనత్తకూతురు చెపుతూ వుండడమే కాకుండా, భక్తితో ఆపె వొక రావిచెట్టుకూడావేసి పెంచింది. నిన్న మొన్నటిదాకా ఆరావిచెట్టు "అమ్మిరావిచెట్టు" అనే పేరుతో వ్యవహరింపబడుతూ, జీవించివుండడం నేనున్నూ యెఱుగుదును. ఆవిడపేరు అమ్మి కనుక ఆవిడ వేసిన చెట్టుకు ఆపేరు వచ్చింది. బహుశః ఆ శతకం నేను స్కూల్లో చదువుకొనే రోజుల్లో పెద్దక్లాసువాళ్ల దస్తరంపాటుతో నాదస్తరం పెంచడానికి చేసిన తెలివితక్కువ పనిలో నశించిందేమో? ఈ సంగతి లోగడ వుదాహరించే వున్నాను.
నాకు పూర్వం చాలామంది మా వంశస్థులు కవులున్నారనే నమ్మికచేత నేను"కవితారంభప్రియంభావుకంబై మావంశము వొల్చు" అని దేవీభాగవతంలో వ్రాయ సాహసించాను. నాతరంలో నాపినతండ్రి కొడుక్కూడా కవిత్వం చెప్పేవాడు. వట్టికవిత్వమే