మా ముత్తాత
309
మరణానికి అక్కడికి వెళ్లడమెందుకంటే : మా గ్రామం, గౌతమీభాగాల్లో వకటైన తుల్యభాగా తీరమే అయినా, వింధ్యపర్వత భాగంలో చేరుతుంది. అందుకే శ్మశానప్రదేశాన్ని తుల్యభాగకు అవతలి వొడ్డున మాగ్రామస్థులు యేర్పఱచుకొన్నారు. వింధ్యపర్వత సంబంధం వున్నచోట ప్రాణం విడిస్తే గాడిదజన్మం వస్తుందని పూర్వులకు భయం. మహాగౌతమీ తీరమైనప్పటికి రాజమహేంద్రవరానిక్కూడా ఈ దోషం వుందట. బజారు వీథివఱకున్నూ ఫరవాలేదని కొందఱు, అంతేకాదు అయిదుక్రోసులవఱకున్నూ గౌతమీతీరంలోనే లెక్కని మటికొందఱున్నూ చెప్తారు. ఈ సంశయంతో మనకేంపని అని మాముత్తాతగారు నిస్సంశయప్రదేశానికి రాబోయే మరణాన్ని గమనించి వెళ్లేరేమో అని నాకు తోస్తుంది. యేలాగైతేనేమి పుస్తకాలతోపాటు పారీఖత్తులుకూడా మాతాతగారి చేజిక్కడంచేత ఆయన కొమార్తెకు వెళ్లవలసిన ఆయన తాలూకువాటా భూమి మాకే సంక్రమించింది. నేను నరసకవిగారికి అన్నమునిమనుమడను. కాని మాచిన్న పిన తండ్రి కుమారుడు చిన్న వెంకటశాస్త్రులు నావలె మాత్రమేకాక తల్లి ద్వారాగా సాక్షాన్మునిమనమడుకూడా అయియున్నాడు. కారణం, అతని తల్లి నరసకవిగారి దౌహిత్రురాలు.
ప్రస్తుతానికి వద్దాం. ఇంతకూ మాతాతగారు యెంత భద్రంగా జాగ్రత్తపెట్టినా ఆయన కాలంలోనే మా ముత్తాతగారి కవిత్వంలో ముఖ్యమైన యామినీపూర్ణతిలక శుద్ధప్రతి నాకు దొరక్కపోయింది. ప్రయత్నించగ తుదకు వకమంగలి, విద్యాసక్తుఁడు యెక్కడో వ్రాసుకున్న ప్రతి నా బాల్యగురువులలో నొకరైన మధునాపంతుల సూరయ్యగారు సంపాదించి యథామాతృకగా వ్రాసుకున్నారు. అది నాకు వారు వ్రాసుకొనడానికిచ్చారు. కాని దానియందున్నూ దురుద్ధరమైన లోపాలున్నాయి. యేమయినా “లేనిబావకంటే గుడ్డిబావ మెఱు" గని దానినిబట్టి వక ప్రతి నేను కావ్యాలు చదువుకొనే రోజుల్లో వ్రాసుకున్నాను. అంతట్లో తునిలో భాగానగరం గురులింగదేవర అనే జంగమ కులస్థుఁడు దీనిని అచ్చువేస్తూ అయిదాశ్వాసాలు మాత్రమే దొరకినట్టున్నూ, ఆఱోది తనకు దొరకనట్టున్నూ, నాపేర దానిని యిప్పించవలసిందని ప్రార్థనగా వత్తరం వ్రాయగా, నా దగ్గఱనున్న ప్రతినిబట్టి వ్రాసి ఆయనకు నేను ఆఱవది పంపించాను. ఆ అచ్చుప్రతే వీరేశలింగం పంతులవారికి దొరకినదిన్నీ ఎవరి తప్పులో నిర్ణయింప శక్యంగాదుగాని, ఆ అచ్చుప్రతి నిండా తప్పులు కుప్ప తెప్పలు. ఇటీవల మాముత్తాతగారి వేంకటేశ్వరవిలాసం నేను ముద్రిస్తూ యామినీపూర్ణతిలకను కూడా ముద్రిద్దామని అనుకున్నానుగాని, తప్పులు సవరించడానికి నాతరం కాకపోయింది. బాగా ఆలోచిస్తే ఆ తప్పులలో వ్రాత పొరపాట్లు కానివిన్నీ యెన్నో వున్నాయి. అవి గ్రంథకర్తవేగాని అన్యులవి కావని నాకు పూర్తిగాతోచి, సంస్కరణానికి లొంగని హేతువున ఆ వుద్యమాన్నుంచి విరమించి వూరుకొన్నాను. ఇప్పుడు లోకంలో ఆ