కవుల కష్టసుఖములు
225
శా. “ఆ విప్రోత్తము వజ్రపంజరనిభంబై నిశ్చలంబైన స
ద్భావంబు... పూవై తన్మకరందమైకరగెఁబోపో నీటికిన్ బల్బనై."
ఆయీ సారంగు తమ్మయ్య కవీంద్రుఁడు యెవరినీవరవడిగా పెట్టుకొన్నట్లు నాకు గోచరించదు. శ్రావ్యమైన ధోరణిలో యావత్తూ సాగించాఁడు. యితని కితఁడేసాటి. మనువస్వాది చరిత్రలున్నా యితని రచన పఠించేవారు చాలామంది వుంటారు.
“వలపించుటే కాని వలచి దక్కవుగదా
కుసుమబాణునికైనఁ గోమలాంగి!
బయటిమాటలెకాని భావమీయవుగదా
అల కళానిధికైన నలరుబోడి!...”
“కొడుకులు గల్లుదాఁక నొక కొన్ని దినమ్ములు చింత... ...
... ... ... ... ... ... తను నోలి భజించని చింత తండ్రి కె
ప్పుడుగడుఁ జింత సేయుదురు పుత్రులు శత్రులుగాక మిత్రులే."
ఆయీ పద్యాలు కవిరాజమనోరంజనంలోనివి. కనుపర్తి అబ్బయామాత్యుని రచన. యితఁడు పేరుదగ్గిరనుంచినిన్నీ కవికర్ణరసాయనాన్ని (సంకుసాల కవికృతం) అనుసరించినట్లు స్థూలదృష్టికి గోచరించినా, అతని రచన కన్న యితని రచనే మృదువైనది. కొన్ని ఘట్టాలు చదివితీరాలి. యే కొన్ని పద్యాలలోనో, యితరుల పద్యాలపోలిక లుండిన నుండుఁగాక. అంతమాత్రం చేత కవిని సహృదయులు తోసిరా జనరు. అసలు గ్రంథకర్త స్వకపోల కల్పితం కూడా కొంత వున్నదా, లేదా అని పరిశీలించాలి. భవతు. వుపక్రమించినది కవుల కష్టసుఖాలు. వ్రాస్తూవున్నది మఱొకటీ కావడం లేదు గదా? లేదు. ఏ రచయితను గూర్చికాని మీరు (మిడిమిడి జ్ఞానంతో) ఆక్షేపించకండి. అందులోనూ తెలుగురచన విషయంలో మఱీ జాగ్రత్తగా వుండాలి సుమండీ!
“తెలుఁగు తెలుగఁని యద్దాన దిగుటెకాని
సంస్కృతమ్మునకన్న కష్టమ్ము హెచ్చు"
యీ మాట నేను యెంతో అనుభవం మీఁద వ్రాసిందిగా తెలుసుకోండి.
“కేవలగ్రామ్యపదముల నేవగించి
జనులు వాడెడి పదములు సమ్మతములు
కలవు లేవని పెనగ శక్యంబె? భార
తాదులను లేని పదములు నవనిగలవె.”
(దేవీ భాగ. 1 స్కం, చూ.)