పుట:Bharatiyanagarik018597mbp.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతీయ నాగరికతా విస్తరణము.

11. యవద్వీపము (జావా)

యవద్వీప ప్రశంస.

హిందూవాఙ్మయమునం దనేకస్థలములలో యవద్వీపప్రశంస గలదు. సీతాన్వేషణార్థమై దన యనుచరుల ననేక దిశలకు బంపుచు సుగ్రీవుడు వారలు మార్గమునం దతిక్రమింపవలసిన దేశములను బేర్కొని యున్నాడు. అందుబ్రాగ్దిశకేగువారలు గంగానదీముఖద్వారమును దాటి, సువర్ణద్వీపము నతిక్రమించి, యనేకములగు బంగారపు గనులు గలిగి యేడు రాజ్యములుగ విభజింపబడిన యవద్వీపము నన్వేషింపవలసి యుండెను.

క్రీ. శ. 2 వ శతాబ్దమునం దనేకదేశములను దిరిగి యొక భూగోళశాస్త్రమును రచించిన "టాలెమీ" (Ptolemy) యను యవనదేశీయుడు "జబడియా అనగా యవలుపండు ద్వీపమని యర్థము. ఇచ్చటిభూమి కడు సారవంతమైనది. ఇందనేక బంగారుగనులు గలవు" అని వ్రాసియున్నాడు. బౌద్దగ్రంథములగు మిలిందపన్హశ్లోక సంగ్రహ మున్నగు వానిలో నావికులకు బ్రాగ్భాగమున గాంచనగు నౌకాశ్రయస్థానములు వర్ణింపబడియున్నవి. వానిలో తక్కోల, కలముఖ, మరణపర, వెనుంగ, వెరపధ, జవ, తామ్రలిప్తి, వంగ, సువర్ణకూట, సువర్ణభూమి మున్నగునవి ముఖ్యములు. క్రీ. శ 5 వ శతాబ్దమున జీవించిన ఆర్యభటుడను జ్యౌతిశ్శాస్త్రజ్ఞుడు