బౌద్దమతము క్రీస్తుశకమునకు బూర్వమే చైనాను ప్రవేశించెను. క్రీ. పూ. 218 లో అశోకుడు భిక్షువుల నంపెను. క్రీ. పూ. 121 లో క్యూపిన్గస్ అనుసేనాని హూణులతో యుద్ధముజేయునపు డొక బంగారపు బుద్దవిగ్రహమును సంపాదించెను. క్రీ. శ. 68 లో నెక హ్వాన్ చక్రవర్తి బౌద్దులను గొనితెచ్చుటకై యనుచరులనంపగా వారు హిందూదేశమునుండి కశ్యపమతంగ, ధర్మరత్న యనువారలను రాజధానికి గొనిపోయిరి. ఇదేసమయమున బాక్ట్రియను రాజులవద్దనుండి యొక రాయబారి బౌద్దగ్రంథము నొకదానిని చైనాకు దెచ్చెను.
మార్గములు
పూర్వకాలమున నేటివలె హిందూదేశము చైనాదేశపు దక్షిణపశ్చిమ సరిహద్దువరకును వ్యాపించియుండలేదు. ఈరెండుదేశములకును నడుమ నెన్నియోరాజ్యము లుండెడివి. భారతీయ బౌద్దమతము చైనాదేశమున వ్యాపించుట కీమధ్యనుండిన చిన్నచిన్న రాజ్యములు విశేషముగ దోడ్పడినవి. గాన ఏవిమధ్యనుండి యాకాలమున హిందూచైనాదేశములకుగల మార్గములను గుర్తింపవలసియున్నది. ఇట్టివి నాల్గుమార్గము లుండెడివి.
(1) టర్కీస్థానమార్గము :- చైనాలోని లాబ్నార్ సరస్సునకు పశ్చిమమునను, హిందూదేశములోని కాశ్మీరమున కుత్తరమునగల హిమాలయములకు పైనున్న పామీర్ పర్వతములకును దూర్పునను, టిబెట్దేశమున కుత్తరమునను, టారిమ్మైదానము గలదు. ఈ మైదానమున క్రీ. పూ. 2 వ శతాబ్దమున 36 చిన్న రాజ్యము లుండెడివి. కాన్క్పా రాజ్యములోని టుఎన్ హోన్గ్ అనుపట్టణమునుండి టారిమ్మైదానముమీదుగా పశ్చిమమునకు రెండుమార్గములుండెడివి. పురుషపురము (Peshawar) వలెనే క్రీస్తుశకారంభమునం దీ నగరమనేక జాతులవారి నాకర్షించి వివిధనాగరీకతలను మేళవించినది. 3 వ శతాబ్దమునం దిచ్చట భారతీయులు గొందరు స్థిర