భావమును వహించి యుండుననుట యీ శాస్త్రంబున నాద్యమైన న్యాయ్యంబు.
ఒక్కనిదర్శనముంజూపి యీ విషయ మింతటితో నిప్పటికి జాలింతము. ఆకలిచే నొచ్చినవాడొకడు ఫలములగోసి తినుట కారంభింపుడు తొలుత నాస్వాదించిన ఫలంబులు బహురుచ్యములును సుఖదంబులును అగుటజేసి ఆ సంతోషములో చెట్టెక్కి కోయుటచే నగు శ్రమను బొత్తిగ మఱచిన వాడగును. కొంతవడికి ఆకలి బాధ తగ్గుడు ఇంత మీదికెక్కితినె కాలుజాఱిపడిన నేమిగతి? కోయ గోయ రెట్టలు నొప్పియెత్తుచున్నవి; అని తలపోసి 'ఈ సుఖమున కీకష్టము సరియైన మాఱుబేరమా' యని చింతించును. మఱి కొంతవడికి గ్రుక్కుమిక్కనకయుండునట్లు గొంతువఱకు దిన్నవా డయ్యెనేని 'ఈపండ్లంత రుచిగాలేవు. ఏబుద్ధిచే దినుచుంటినోగాని నిజముగ జూడబోయిన ఱోతగానున్నవి. మఱి చేతులో యెత్తుటకు సాధ్యములుగావు. కావున నింక నీ యప్రయోజనమగు యత్నము జాలించెదను' యని తలచి చెట్టుదిగి వృక్షాధిదేవత కొక నమస్కారమైన వయక తనత్రోవ బోవును. ఇందును బ్రయోజనము, రాశి, శ్రమ, మూల్యము వీనికింగల పరస్పరావలంబనము విశదీకరింప బడియె.
అర్థశాస్త్రములోని ముఖ్యభాగములు
వస్తువులను బోల్చిచూచి తారతమ్య నిర్ధారణమొనరించి వానిని మార్చుకొనుటకు మూల్య మెత్తినసాధనము. వస్తువులే లేకున్న మార్పాటు జరుగుటెట్లు? కావున ఉత్పత్తి వినిమయమునకు నాద్యంబు. మఱియు గొనువారులేకున్న తమకుం గావలసినదానికన్న నెక్కువను గడించువారు నుండరు. ఇంతేకాదు. ఉప్పు, చింతపండు, మిరియాలు, వస్త్రములు, ధాన్యములు, ఎద్దులు, బండ్లు, సమస్తమును దామే సేకరించుకొనవలసివచ్చును. ఇది యసంభవము గాన ఉత్పత్తికి వినిమయ మాద్యంబనియుం జెప్పదగును. కావున నివి యన్యోన్యాశ్రయ