కులకును దురగముల యందలి రాగము హెచ్చును. ఆవులయందలి రాగము తగ్గును. అనగా గుఱ్ఱముల మూల్యము వృద్ధిని, ఆవుల మూల్యము క్షయమునుం గాంచుననుట. నాలుగావులియ్యనిది గుఱ్ఱము లలభ్యములౌను. ఇట్టిచో బశుపాలుర కధికోత్పత్తిదోషము గలిగినను గలుగవచ్చును.
కావున నధికోత్పత్తి యనగా నధికఖండోత్పత్తియని యర్థము. ఇందమితభావము కొన్ని సమయములం దటస్థించుటగలదు. అఖండముగ నన్నిపదార్థములును వృద్ధికివచ్చిన నమితత్వదోష మేనాడుం గల్గదు.
అట్లౌట నధికోత్పత్తివలని క్షోభముయొక్క లక్షణము లేవియన;
ఒకటో, కొన్నియో వృత్తులయందు పంట లమేయములౌట. దానిచే వానియొక్క విలువ తఱుగుట. అందుచే నావ్యాపారముల యందలి వారికి నష్టము గష్టము గలుగుట. ఇట్లు కొన్నింటిమాత్రం చెందునది గావుననే దీనికి ఖండక్షోభయనిపేరు. అయిన నొక్కటి. బొంబాయిలో బ్రధానవ్యాపారము ప్రత్తి. ఇందు నమితోత్పాదనముచే క్షోభ గలిగినయెడల నాయుత్పాత మావృత్తిలో ననర్థ మాపాదించుననుట స్పష్టము. మఱియు ప్రత్తివృత్తి పాడు పడిన దానినుండి రెండు భయంకర రూపములు వెల్వడును. 1. సాహుకారులు బీదలౌటచే వారు మిగిల్చిన ధనమంతయు మునిగిపోవును. అందుచే బ్యాంకీలలోని నిక్షిప్తముల రాశి తగ్గును. అనగా సర్వవ్యవహారముల కాధారమైన మూలధనము కొఱతవడును. 2. ముఖ్యమైన వ్యాపారం లెవ్విముగిసినను తదితర వ్యాపారములలో సైతము నమ్మకము నాణెములు నుఱ్ఱూతలూగును. అప్పుడప్పుడు చులకనగా దొరకవు. ఈ రెండు కారణముల చేత ఖండక్షోభలు ప్రధానవృత్తులం జెఱిచెనేని యకండక్షోభలును నవతారమెత్తజూచును.