పుట:Bhaarata arthashaastramu (1958).pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుగమునందును స్త్రీ పురుషులు భిన్నప్రవృత్తులయియే యుండిరి. వంటపని స్త్రీలయది. వేట పురుష సామ్రాజ్యము. పశుపాలనా యుగమునందు భిన్నత యింకను బ్రబలమాయె. యజమానులు, పనివాండ్రు, చర్మకారులు, కంబళ్ళునేయువారు, పాలు, పెరుగు, వెన్న, జున్ను, వీనిచే గాలము నడుపువారు. ఇట్లు జనులు బహుమార్గగతులయిరి. వ్యవసాయ యుగమునందు ఆర్థికకర్మమను మహానది చీలినదై యనేక సంఖ్యాముఖమ్ములతో బ్రవహించి లోకోపకారిణియాయెను. అప్పుడు పుట్టిన శిల్పులు వడ్రంగి, కుమ్మరి ఇత్యాదులు. మఱియు జనులు నారదునట్లు సంచార పరాయణులై యుండుటమాని స్థిరనివాసాసక్తచిత్తులై యున్నందున పల్లెలు, నగరములు నేర్పడియె. సంఘములుగ జేరి యొకరితో నొకరు కలసిమెలసి మాటల జర్చల బరస్పరాభివృద్ధివడసి నందువలననే యభివృద్ధికి నాగరకతయను పేరుగలిగె. నగరములలో నవతారమెత్తిన నవవిలాసిని నాగరకత. ఇట్లు వ్యవసాయ యుగము తత్పూర్వస్థితులకన్నమించి మెఱుగెక్కినదగుట, అలంకారక్రియ లుత్పన్నములై కంసాలి, చిత్రకారులు మొదలయిన వారికి నాలవాలమయ్యెను. హిందువులు మొత్తముమీద నీస్థితిలో నిప్పటికి నున్నారు.

క్రియాపరిచ్ఛేదము

ఇంకను ఘనతగాంచిన పాశ్చాత్యులలో వృత్తులు వేఱుపడుటయకాదు. ప్రతివృత్తికిం జేరిన భిన్న భిన్న క్రియలును ప్రత్యేక వృత్తులం బోలియున్నవి. దృష్టాంతము:- పొలముకాపు, పంటపండిన తోడనే, గింజలనురాల్చి యమ్మివేయును. తనకు ధాన్యముతో నెక్కువజోలిలేదు. వానినెండబెట్టి, యంత్రములచే బొట్టు దీసికొన్న వారు పిండిచేయువారి కమ్ముదురు. వీరు పిండిసేసి రొట్టెలవానికి విలుతురు. పొలముకాపు వానియొద్దనుండి రొట్టెలగొని కుటుంబభరణ కార్యము నెరవేర్చును. ఈ దేశములో నీక్రియలన్నియు నింటిపనులు.