అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 17
మోహి -- మాఅమ్మ వస్తూవున్నదా?
వెంక -- యేఅమ్మ గారా? యేలినవారి భార్యాగారు. శ్యామలాంబగారు. నేను వెళుతూవుండగా అమ్మగారిబండి యెదురుగావస్తే నేను వెనక్కు పరుగెత్తుకొని వచ్చినాను.
కర -- ఇక నేను బ్రతికినాను. నాకు మళ్ళీ ప్రాణాలువస్తూ వున్నవి.
రామా -- మీరు యీ ఆకులూ అన్నీ తీసి వెయ్యండి. వేగిరం కరటకా! నీవీదొడ్డితలుపుతీసి మోహినిని యింటికి పంపించివెయ్యి. (అని తలుపువద్దకు పరుగెత్తుకొనిపోయి) ఈపెరటితలుపు తాళము వేసియున్నది. కరటకా! తాళంచెవి యేదీ?
కర -- తాళంచెవా?
రామా -- అవును, తాళంచెవి వేగిరం ఇయ్యి.
కర -- (దేహము తడువుకొనుచు) తాళముచెవి పోయింది.
రామా -- అయ్యో! ఇప్పుడేమిచెయ్యను? నాకు అసాధ్యం వచ్చినది. నాభార్య బండిదిగి వస్తూవున్నది. కరటకా! నీవీచిన్న దాన్ని యిప్పుడీవసారాలోకి తీసుకొనివెళ్లు. నేనుయెదురుగా వెళ్ళి నాభార్యను తీసుకొనివస్తాను.
కర -- మంచిది. (అని మోహినితో వసారాలోకి పోవుచున్నాఁడు.)
[అప్పుడు శ్యామలాంబప్రవేశింపఁగా, రామాకాంతముపంతు లెదురుగాపోవుచున్నాఁడు. మోహినిని విడిచి కరటకరెడ్డి వచ్చు చున్నాఁడు.]
శ్యామ -- ఓప్రాణేశ్వరా! మీకు తెలివివచ్చినదా? నేను మిమ్మల్ని చూడనేమోనని యేడుస్తూవచ్చినాను.