పుట:Andhrula Charitramu Part 2.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ ప్రకరణము.

తెలుగు చోడులు.

ఎనిమిదవ శతాబ్దములో రేనాటిని బరిపాలించిన ప్రాచీనాంధ్రచోడులయొక్కయు, మొదటి కులోత్తుంగ చోడ చక్రవర్తికి ప్రతినిధులుగానుండి వేగిదేశమును బరిపాఆలించిన వెలనాటి చోడుల యొక్కయు, జరిత్రమును సంగ్రహముగా నాంధ్రులచరిత్రములోని ప్రథమ భాగమున దెలిపియున్నాడను. చాళుక్యచోడ చక్రవర్తులకును, కాకతీయ చక్రవర్తులకును లోబడిన సామంతులుగనుండి, తెలుగుదేశములోని పొత్తపినాడు, పాకనాడు, కమ్మనాడు మొదలగు నాడులను బరిపాలించి విఖ్యాతిగాంచిన మరికొన్ని చోడవంశములును గలవు. ఆ చోడవంశములయొక్క చరిత్రమునే సంగ్రహముగ నీ ప్రకరణమున వివరించుచున్నాడను. ఇదివరకు దెలిసికొనబడిన చోడవంశములోని యుపశాఖలన్నియును ద్రావిడభాషా సారస్వతములోని గాథలలో బేర్కొనబడిన కరికాల చోళుని వంశమునుండి యుత్పత్తి గాంచినట్లుగ జెప్పబడియున్నవి. వెలనాటి చోడులు తాము కరికాల వంశజులమని చెప్పుకొనలేదుగాని, రేనాటి చోడులు మాత్రము తాము కరికాల వంశజులమనియు, కాశ్యప గోత్రులమనియు జెప్పుకొనియున్నారు. ఆ రేనాటి చోడులకును, ఈ ప్రకరణమునందు దెలిపెడి పై మూడునాడుల చోడులకును, కొంతవరకెద్దియో సంబంధముండియుండ వలయును. తంజాపురి చోడులతో దమకు సంబంధము గలదని యెవ్వరును జెప్పుకొనిలేదు.

కరికాలచోళుడు.

తాము సూర్యవంశజులమనియు, కరికాలచోడుని సంతతి వారమనియు, జెప్పుకొని యుండుట చేత కరికాలుడెవ్వడో మనము తెలిసికొన