పుట:Andhrula Charitramu Part-1.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురాణములో దెల్పబడియెను.[1] సహదేవుడు తన దక్షిణదిగ్విజయమును గూర్చి చెప్పుసందర్భమున దాను బాండ్యులను జయించిన తరువాత దక్షిణాపథమునకు బోయియుంటినని చెప్పినట్లుగ మహాభారతమున జెప్పబడినది.[2] సహ్యగిరియందు జనించు గోదావరి మొదలగునదులు దక్షిణాపథదేశములోనివని వాయుపురాణము దెల్పియుండియునర్మదాతాపీనదులనట్లు పేర్కొని యుండక పోవుట చేత నా రెండునదులు ప్రవహించెడి దేశములు దక్షిణాపథములోనివి కావని చెప్పవలసి యున్నది. [3] ఆంధ్రదేశము దక్షిణాపథములోనిదని యిదివరకే దెలిపియుంటిమి. దక్షిణాపథము వేర్వేరుగ్రంథ కర్తలచే వేర్వేరు విధములుగా నిరూపించబడుచున్నవనవచ్చును గాని సామాన్యముగావింధ్యకు దక్షిణ భాగమంతయు దక్షిణాపథముగానే వ్యవహరింపబడుచు వచ్చెననుటకు సందియము లేదు.

ఆర్యులు దక్షిణమునకు వచ్చుట.

ఉత్తరము నుండి యార్యులు దక్షిణమునకు వచ్చుటకు బహుకాలము పట్టి యుండును. ఆర్యాశ్రమములకు దక్షిణపర్వతముండెనని మనువు పతంజలి మొదలగువారు చెప్పియుండిరి. ప్రచండభాస్కరుని మార్గమునరికట్టి వింధ్యపర్వత మాకాశమంటుకుని విజృంభించి లోకమునంతయు నంధకారబంధురముగావించి గర్వించి యుండెనని పురాణకవుల భాషలో జెప్పబడినది. ఆర్యుల దక్షిణాపథము నవరోధించి గర్వించి యుండిన వింధ్యముయొక్క గర్వము నడంచు మహావీరుడు బయల్పడునంతవరకు నార్యులకు మార్గావరోధము గలిగియుండెను. అట్టి మహావీరు డగస్త్యమహర్షి. ఇతడు

  1. మార్కండేయపురాణము. అధ్యాయము 57. శ్లోకము. శ్లోకము 45. పాఠము రెండవపంక్తి తప్పుగనున్నది. పాండ్యాశ్చైవ కేరళాశ్చైవ చోళాఃకుల్యాస్తధైవచ. అని యుండవలయును. వాయుపురాణము. అధ్యాయము, 45, శ్లోకము. 174. మత్స్యపురాణము, అధ్యాయము 117 శ్లోకము 43.
  2. మహాభారతము. సభాపర్వము. అధ్యాయము. 31 . శ్లోకము 17.
  3. వాయుపురాణము. అధ్యాయము 45 శ్లోకము 104.