పుట:Andhrula Charitramu Part-1.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

ఆంధ్రదేశ కథాసంగ్రహము

ఖనిజములు.

సమస్తలోహపదార్థము లీదేశమునం దుత్పత్తియగుచున్నవి. కోలారు లోను, హైదరాబాదులోను బంగారు గనులు గలవు. మంచియినుము పెక్కుచోట్లదొరకును. నేలబొగ్గు హైదరాబాదు రాజ్యమునందు విశేషముగాజిక్కుచున్నది. అభ్రకపుగనులు కూడపెక్కులు గన్పెట్టఁబడినవి. ప్రశస్తములయిన వజ్రముల కీదేశము ప్రసిద్ధికెక్కియున్నది.

జనసంఖ్యయు; భాషయును.

ఈ మహాదేశమిప్పుడు రెండుకోట్ల పదిలక్షలమహాజనులచే నిబిడీకృతమైయున్నది. వీరికిమాతృభాషయగు నాంధ్రము హిందూస్థానమునందలి దేశభాషలలో మూడవదియై మాధుర్యమునందు “ఇటాలియనుభాషను” బోలియున్నదని ఖండాంతరపండితులచే సహితము గొనియాడబడుచు దినదినాభివృద్ధిగాంచుచున్నది. ఇట్లాంధ్రదేశమునందు మాత్రమేగాక ద్రావిడ, కర్ణాటకదేశములందును నాంధ్రము మాటలాడువారలనేకులున్నారు. చెన్నపట్టణమునందుండెడి జనములలో నాల్గవవంతుకుఁబైగా జనులాంధ్రులుగ నున్నారు. ద్రావిడదేశమునందలి జమిందారులనేకు లాంధ్రభాష మాటలాడు నాంధ్రులుగ నున్నారు. ఈయాంధ్రులు పదునైదవ పదునారవ పదునేడవశతాబ్దములయందు విజయనగరపురాజులు దక్షిణదేశమునకు దండెత్తిపోయి పాండ్య, చోళ, కేరళ దేశముల నాక్రమించుకొని పరిపాలించిన కాలమున ద్రావిడదేశమునకుబోయి నాటనుండియు నచ్చటనే నివసించుచున్నారు. ఇంతియేగాక బొంబాయి పట్టణమునందును కాశీపట్టణమునందును బర్మాలోని రంగూను మోల్మేను(Moulmein) పట్టణములయందును నివాసము నేర్పఱచుకొనివసించునట్టి యాంధ్రులనేకులున్నారు. వీరికందఱికి నాంధ్రము మాతృభాషగానున్నను వీరందఱు నుచ్ఛారణమునందును నడవడులయందును స్థలభేదములను బట్టి భేదించియన్నారు. ఉత్కలదేశప్రాంతములవా రొకరీతిగను, ద్రావిడదేశప్రాంతములవారు వేరొకరీతిగను, కర్ణాటదేశప్రాంతములవారు మఱొకరీతిగను, మహారాష్ట్రదేశప్రాంతములవా రింకొకరీతిగను వేషభాషలయందు వేఱుపడి ఆయాదేశ