పుట:Andhrula Charitramu Part-1.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రగుప్త చక్రవర్తి యాస్థానమందుండిన మేగాస్తనీ సనుయవనరాయబారిచే బేర్కొనబడిన "మోడో కళింగే" (Modo Calingae) యను నదియె యీమధ్యమ కళింగమని స్పష్టముగా జెప్పవచ్చును. (Ind, Ant Vol VI, R. 338) మధ్యమ కళింగమని కళింగదేశములోని యొకభాగము వ్యవహరింపబడినపుడు మఱియొకభాగము త్రికళింగమని వ్యవహరింపబడి యుండెననుట యబద్ధము కానేరదు. అట్లగుటంజేసి విశాఖపట్టణమండలము మధ్యమకళింగముగాను, గోదావరి మండలము త్రికళింగముగాను, గంజాము మండలముత్తర కళింగమముగాను, ఒకప్పుడు వ్యవహరింపబడినవని మనము విశ్వసింపవచ్చును. ఉత్తరకళింగము గంగానది వఱకు వ్యాపించియుత్కలదేశమై యుండవచ్చును. త్రికళింగము కాంచీపురమువఱకు వ్యాపించి త్రిలింగదేశమై యుండవచ్చును. అనివారితశక్తత్రయ సంపన్నుడని కోకిలవర్మ యొకశాసనమునందు బేర్కొనబడియుండెను. చంద్రగ్రహణ సమయమున ముంజేఱు గ్రామనివాసియగు బ్రాహ్మణున కొకనికి బొద్దేఱియనుగ్రామమును దానము చేసెను. చంద్రగ్రహణ సమయముననే ముంజేఱుగ్రామనివాసియగు అశ్వశర్మయను బ్రాహ్మణునకు వెట్టువాడయను గ్రామమును దానముచేసియుండెను. ఈరెండు గ్రామములును భోగిపుర విషయములోనివే. ఈశాసనములలోని ముద్రికలలో "శ్రీఅనివారిత శ్రీఅనివారితంబు" అను చిరునామాలు గలవు. ఈ శాసనము లలోని లేఖనము దోషభూయిష్టమై యుండెను.అయిన నీ శాసనములు కుబ్జవిష్ణువర్ధనుని జయసింహుని, రెండవ విష్ణువర్ధనుని శాసనములలోని లిపినిగలిగి వానిమార్గమునే కొంచెమించుమించుగా ననుసరించి యున్నది. ఈయనివారిత బిరుదము పశ్చిమచాళుక్యరాజగు మొదటి విక్రమాదిత్యుడు వహించియుండెను. ఆ బిరుదము నేయీతడవలంబించియుండెను. అతడే రాజవంశములోనివాడో స్పష్టముగా దెలియరాదు. చాళుక్యులలో నొకరుతక్క మఱెవ్వరును వర్మయను పట్టపుపేరును ధరించియుండలేదు గాని చాళుక్యులకు బూర్వమునందుండిన పల్లవులు ధరించుకొనియుండిరి. అయినను వీనిశాసనములు చాళుక్యులవి యగువరాహముద్రికలను గలిగియున్నవి