పుట:Andhrula Charitramu Part-1.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దని చెప్పియున్నాడు. భూమి సారంవంతమైనదనియు, పలుపంటలు పండుచున్న వనియును, దేశమున నడవులు పెక్కులున్నవనియు, పట్టణములలో జనసంఖ్య తక్కువగ నున్నదనియు మనుష్యులు పచ్చన నలుపు గలిసిన చామనచాయవర్ణముగలిగియున్నారనియు, ధైర్యసాహసములుగలిగి భయంకరులుగా గన్పట్టినను విద్యాసక్తి కలవారుగా నుండిరని చెప్పియున్నాడు. బౌద్ధుల పురాతన సంఘారామములు శిథిలములై యున్నవనియును నూఱుదేవాలయములనేక శిష్యులను గలిగియుండగా బౌద్ధారామములు తొంబది మాత్రమే జనులచే నలంకరింపబడి యున్నవని చెప్పియున్నాడు. మఱియును ధాన్యకటకములోని బుద్ధుని గౌరవార్థముగా గట్టబడిన రెండుసంఘారామములను పూర్వశైల సంఘారామమని, అపర్ణశైలసంఘారామమని పేరు పెట్టియున్నాడు. మహాంధ్రదేశమునకు నైరుతీమూలనుండిన చోడదేశమునకు (కడపమండలము) బోయెను. దేశము కొల్ల పెట్టబడి యుండుటచేత మిక్కిలి తక్కువయిన జనసంఖ్యగలిగి యడవులచే నావరింపబడి క్రూరచిత్తులను దుష్ప్రవర్తకులయిన జనులతో గూడియున్నదని నుడివియున్నాడు. ఈదేశమును చుళియ(Chuliya) అనగా చోడదేశమని పిలిచియున్నాడు.

హౌనుత్సాంగు ఆంధ్రచోడదేశమునుండి కాంచీపురమునకు బోయెను. కాంచీపురము రాజధానిగానుండిన దేశమును తాలోపిన (Tha-lo-pi-cha) అనగా ద్రావిడదేశమని పేర్కొని యున్నాడు. భూమిసారవంతమై చక్కగ వ్యవసాయము చేయబడుచున్నదనియు, ధాన్యములు మొదలగుపంటలు సమృద్ధములుగా ఫలించుచున్నవనియును చెప్పియున్నాడు. రాజధానియగు కాంచీపురము 5,6 మైళ్ల విస్తీర్ణముగల పట్టణమనియును, దేశములో నూఱుబౌద్ధ సంఘారామములును పదివేలమంది బౌద్ధమతాచార్యులును గలరనియును, సింహళద్వీపవాసులవలెనె వీరిలోననేకులు స్థావీరవిద్యాలయమునుకు జేరిన మహాయనాశాఖాసంబంధులనియును, హిందూదేవాలయములు 90 మాత్రమె కలవనియును, దక్షిణహిందూదేశముయొక్క దక్షిణభాగములలో వలెనె దిగంబర జైనసన్న్యాసులుకూడ వేనవేలుండిరనియును, హౌనుత్సాంగు పేర్కొని