పుట:Andhrula Charitramu Part-1.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భట్టుకాలమునందుండి గణిత శాస్త్రమునురచించిన పావులూరి మల్లనకవి "ఇలగమ్మ నాటిలోపల విలసిల్లిన పావులూరివిభుండ" నని చెప్పుకొనియున్నాడు అయినను పావులూరి గ్రామము గోదావరిమండలములోనిదని రావుబహదరు వీరేశలింగము పంతులవారు తమయాంధ్రకవులచరిత్రములో వ్రాసియుండుట కాధారమేమో దెలియరాదు. పంతులవారు పొరబడియుండవలయును లేదా గోదావరిమండలములో గూడ మఱియొక కమ్మనాడుండవలయును. గుంటూరిమండలములోని కమ్మనాడే ప్రాచీనమైనదని చెప్పటకు లేశమాత్రమును సందియము లేదు. ఇప్పటియాంధ్రులలో నొక తెగవారగు కమ్మవారు కమ్మకరాఠవిషయమునకు సంబంధించినవారుగ గన్పట్టుచుండుటచేత నీ తెగవారు క్రీస్తుశకారంభమునుండి యున్నవారని చెప్పవచ్చును.

నైయోగికులు లేక నియోగులు.

కుమారవిష్ణువుయొక్క చెందలూరు శాసనమున రాజకీయోద్యోగీయులకు (Officials)నైయోగికులన్నపదము వాడబడినది. చాళుక్యరాజగు మంగియువరాజుయొక్క చెందలూరు శాసనమునందు నైయోగికులన్నపదము వాడబడినది. కాబట్టి యుద్యోగపదవులందుండిన బ్రాహ్మణులను నైయోగికులు లేక నియోగులని పిలువంబడుచుండుట క్రీస్తుశకమయిదాఱవ శతాబ్దములనుండి వచ్చుచున్నదని పల్లవచాళుక్యరాజుల చెందలూరుశాసనములు చాటుచున్నవి.

త్రిలోచనపల్లవుడు.

వీనినామము పదవశతాబ్దమునాటి పూర్వచాళుక్యుల శాసనములలోని గాథలలో వినంబడుచున్నది గాని మఱియెచ్చటను వీని శాసనము గానరాదు. ఈ త్రిలోచనవర్మపల్లవయోధాగ్రేసరుడని చెప్పంబడుచుండెను. పల్లవులకు గర్భశత్రువులగు చాళుక్యుల మొట్టమొదట నెదిరించినవాడు త్రిలోచన పల్లవుడే. వీని కాలమున నుత్తరకోసలాధీశ్వరుండగు విజయాదిత్యుడయోధ్యనుండి దక్షిణాపథముపై దండెత్తి వచ్చినప్పుడు త్రిలోచనపల్లవుడు వాని