పుట:Andhrula Charitramu Part-1.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యొక్క యుద్దేశము ప్రకారము దనకదేశము ఖడ్గమృగముల దేశముగానున్నది. ఈ యభిప్రాయమునే సూలిమామ్ అను వర్తకుడు దెలుపుచు నట్టి దేశము దక్షిణ హిందూదేశములోని "రూమి" (Ruhmi) యని పేర్కొని ఒక యుంగరములో దూరిపోగల ట్టి సొగసయిన రవసెల్లాలకు (fine muslins) విఖ్యాతి కెక్కినదని కూడ చెప్పియున్నాడు. ఈ దేశమునే మసుడియను(Masudi)యనునాతడు 'రహమా'(Rahama)యనియు, ఇద్రిసి (Idrisi) యనునాతడు డుమి (Dumi)యనియు, పేర్కొని యున్నారు. ఈ దేశము సముద్రతీరము వెంబడి నున్నదని కూడ మసుడి చెప్పుచున్నాడు.

ఇంతియగాక పదునాలుగవ శతాబ్దమునం దీదేశమును జూడవచ్చిన మార్కోపోలో (Marco polo) అనునతడు, మాబారు దేశమున కుత్తరమున మచిలీపట్టణ మండలములో ముటఫిలి(Mutafili)యనురేవుపట్టణమును బేర్కొనుచు వజ్రములకును , సాలెపట్టును బోలె మిక్కిలి పలచనైన సన్నని బట్టలకును ప్రసిద్ధి కెక్కినదని పేర్కొనియున్నాడు. ఈ ముటఫిలి మచిలీపట్టణమునకు సంబంధించినదని కొందఱునను. మోటుపల్లికి సంబంధించి యుండునని కొందఱును జెప్పుచున్నారు. ఇంకననేకులీ దేశము వజ్రములకును మంచిరవసెల్లాలకును విఖ్యాతి కెక్కినదని పేర్కొనియున్నారు. కాబట్టి టాలెమీ మొదలగువారు రెండవశతాబ్దమున బేర్కొనిన మసాలియా దేశమును, అరబ్బీదేశస్థులు పేర్కొనిన రహామీ లేక డుమి మండలమును అబుదిహాన్ పేర్కొనిన దనకదేశమును ధాన్యకటకమును నాంధ్ర దేశమునకు సంబంధించినవి కాని వేఱొకదేశమునకు సంబంధించినవికావు.[1]

చీనా, జపాను, బర్మా దేశములనుండియు సుమత్రా, జావా, బార్నియో దీవులనుండియును, సింహళమునుండియు, వంగదేశమునుండియు, సీమసాలియా రేవుపట్టణమునకు నోడలు సరకులను గొనివచ్చి మరల సరకులను గొనిపోవుచుండును. ఇంతియగాక నెల్లూరునకు సమీపమున పినాకినీ నదీముఖద్వారమున మఱియొక రేవుపట్టణముకలదు గాని పేరు దెలియరాకున్నది. ఈ దేశమునందలి బట్టలు

  1. Mr. Cunningham's Ancient Geography of India.