పుట:Andhrula Charitramu Part-1.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తరువాత బహుసేనలంగూర్చుకొని యోడలమీద బ్రయాణముచేసి యుత్కలదేశములోని యొక రేవుపట్టణమున దిగి నీలగిరులచెంత మజిలీ యేర్పఱచుకొని నివసించియుండగా శాతకర్ణి సేనాధిపతులలోనొక్కడగు సంజయుడనువాడు నూఱుమంది యాటకత్తెలతోను రెండు వందల యెనుబదిమంది పాటకులతోడను, నూఱు రథములతోడను, పదివేల యశ్వములతోడను, ఇరువదివేల బండ్లతోడను, వేయిమంది సంరక్షక భటులతోడను వచ్చి చేరరాజును గలిసికొని వందనమాచరించి "యోరాజా! మీ మిత్రుడయిన శాతకర్ణి మహారాజు నన్ను మీ కడకు బంపెను. హిమాలయమునుండి శిలగొనివచ్చుట మీ యభిమతమేనిమేము మీకు సహాయముచేసి దానింగొని గంగాభిషేకమును గావించి తీసికొనివచ్చెదము" అని చెప్పెను. అది విని చేరరాజు సంజయునితో నిట్లనియె. "సంజయా! ద్రమిళరాజుల సత్తువ యెఱుంగలేక బాలకుమారుని కొడుకులు కనకసేన విజయసేనలను వారు నిందించుచున్నవారు. ఆ పగ దీర్చుకొనుటకై యీ సేన నడిపింపబడుచున్నది. ఈ సమాచారమును మీ శాతకర్ణునకు దెలియజేసి మహానదియగు గంగానదిమీదుగా నా సేనను గొనిపోవుటకై పడవలను పోగుచేయవలసినదిగా శ్రుతిపఱపుము" అని చెప్పి వాని సైన్యమును గొని వానిని శాతకర్ణుని కడకు బంపెను. తరువాత గొన్ని దినములకు గంగాతీరమునకు బోయి శాతకర్ణి పంపిన పడవల మీద గంగానదిని దాటి యావలియొడ్డునకు బోయినతోడనే శాతకర్ణులు స్వాగతమొసంగిరి.

ద్రమిళార్య రాజులకు యుద్ధము.

వారలకడ సెలవుగైకొని యుత్తరదేశమునకు దండెత్తిపోయి కుయిలాలువమనుచోట నార్యసోదరులగు కనకసేన, విజయసేనులను వారలకు దొడ్పడవచ్చిన ఉత్తరుడు, విచిత్రుడు, రుద్రుడు, భైరవుడు, చిత్రుడు, సింహుడు, ధానుత్తరుడు, శ్వేతుడు మొదలగు రాజుల నెదుర్కొనియెను. అచ్చట నుభయసైన్యములకు ఘోరయుద్ధముజరిగెనె. ఆ యుద్ధమునందార్యులోడిపోయిరి. కనక విజయులను సోదరులిరువురు చెంకుడ్డువానుచే బట్టుకొనబడిరి. వీరలకుండు రాజవేషములను దొలగించి సన్న్యాసులు ధరించు దుస్తుల నొసంగి