పుట:Andhrula Charitramu Part-1.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యేకదీక్షతో బనిచేయ నారంభించితిని. ఇదివరకే చరిత్ర గ్రంథములను ప్రకృతి శాస్త్రగ్రంథముల నాంధ్రభాషలో బ్రకటించి యాంధ్రదేశమునం దంతట విజ్ఞానమును బ్రసరింపజేసి దేశమునకును భాషకును మహోపకారమును జేసి ఖ్యాతిగాంచుచుండిన విజ్ఞానచంద్రికా మండలి వారు ఈ కాలముననే తమ కార్యాలయమును చెన్నపట్టణమునకు మార్చుట సంభవించెను. అందలి సభాసదులు కొందరు నా యుద్యమమును నా దీక్షను గాంచి సంతసించి తా మీ గ్రంథస్వాతంత్ర్యము నపేక్షిపంకయె తమ గ్రంథమాలలో నొకపుష్పముగా నంగీకరింతు మని చెప్పి ప్రోత్సాహము కలుగ జేసిరి. అందువలన గ్రంథమచ్చు పడినతోడనే 2000 ప్రతులమ్ముడు పోవునన్న ధైర్యము గలిగెను గాని యంతమాత్రముచేత నాకష్టములన్నియు నివారింపబడునవి కావు. గ్రంథమువలన వచ్చెడు నాదాయము ముద్రాభృతికిని చెన్నపురిలోనాకగు వ్యయమునకును సరిపోవునుగాని యంతకన్న విశేషలాభమేమియు గానుపింపక పోవుటటుండ ముందు వహింపవలసిన ధనభార మధికమయ్యెను. లాభముండినను లేక పోయినను మొదలుపెట్టినపని విడనాడుట కిష్టము లేక పని చేయుచుంటిని. విజ్ఞానచంద్రికామండలివారు నాకీగ్రంథము నుచితముగా ముద్రింపించి యిచ్చుటకు నౌదార్యము గలవారైనను వారిగ్రంథములపై వచ్చు నాదాయమంతయు వారిగ్రంథముల ముద్రాభృతికే సరిపోవుచున్నందున నంతకన్న నెక్కువ సాహాయ్యమును జేయజాల కుండిరి. కానిమండలివారే యొకా నొక విద్యాప్రియుడగు శ్రీమంతునకు జెప్పి ముద్రాభృతియు నాకు నిప్పించిరి. చరిత్రాసక్తియు నౌదార్యమును గల యీ