పుట:Andhrula Charitramu Part-1.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెను. ఒకనాడు దీపకర్ణి మహారాజు తన వెనుక రాజ్యమేలుటకు తగిన పుత్రుడు లేకపోయెనుగదాయని విచారించుచు నిద్రపోవగా స్వప్నములో నీశ్వరుడు ప్రత్యక్షమై "ఓరాజా! నీవు వేటకుబోయినప్పుడా యడవిలో సింహము మీద సవారిచేయుచు నొక బాలుడు కన్పడును; వానినింటికి దెచ్చికొనుము. వాడే నీకు పుత్రుడగును"యని చెప్పి యదృశ్యుడయ్యెను. అంతట రాజు మేల్కొని యా స్వప్నమును స్మరించుకొనుచు నమితానందమును బొందుచుండెను. ఒకనాడు రాజు మృగయావినోదార్థము మహారణ్యమునందు విహరించుచుండగా మధ్యాహ్నకాలమునందు సింహారూఢుడై బాలసూర్యునిబోలె బ్రకాశించుచున్న యొక బాలుడు నొక తామరకొలనుయొడ్డున జూచెను. వానింజూచినతోడనే రాజునకు స్వప్నము సంగతి జ్ఞప్తికివచ్చెను. సింహము బాలుని దించి నీళ్ళు త్రాగుటకై సరస్సులోనికి బోవుచుండగా దీపకర్ణి యొక బాణమును ప్రయోగించి సింహమునుబడవైచెను. వెంటనే సింహము మనుష్యుడయ్యెను. (?) అంతటా మనుష్యుడు "రాజా; నేను కుబేరుని మిత్రుడను, యక్షుడను; నా పేరు సాతుడు; నేను పూర్వము గంగలో స్నానము చేయుచుండిన యొక ముని కన్యకను జూచి మదనబాణములకు గురియై యామెను గాంధర్వవిధి చేత వివాహమాడితిని; మా దాంపత్యమునుజూచి మునులోర్వజాలక సింహములగుదురుగాక యని శపింపగా మేమిరువురమును సింహదంపతులుగా జనించినారము; కాలక్రమమున నా భార్య గర్భిణియై యీ పుత్రుని కని కాలధర్మము నొందినది; నేనే వీని నితర సింహికల పాలతో బెంచితిని; నీ బాణము తగులగానే నా శాపము తీఱినది; ఈ మహాసత్త్వుని నీకిచ్చెదను; వీనిని పుత్రునిగా గ్రహింపుము; ఈ ప్రకారమే జరుగునని ఆర్యఋషులు విధించియున్నారు" అని చెప్పి సాతుడంతర్హితుడయ్యెను. దీపకర్ణి యీ బాలుని నింటికి గొనివచ్చి సాతుడతనికి వాహనమైనందున సాతవాహనుడని పేరుపెట్టి కాలక్రమమున బట్టాభిషిక్తుని జేసి తపస్సుకై యరణ్యమునకు బోయెను. అది మొదలుకొని సాతవాహనుడు భూమినేలుచున్నాడు.