పొందుచుండును. ఏభాషకైనను నీగ్రాంధిక వ్యావవారికావస్థా భేదములు తప్పవు. ఇతరదేశములలో గ్రంథకర్త లీయంతరము నెక్కువగా నుండనీయక వ్యవహారమునే లక్ష్యముగ నుంచుకొని యుండ, భారతీయభాషలు గ్రంధస్థ భాషనే పరమలక్ష్యముగ జేకొనియుండుటచే వ్యవహారమునకును గ్రంధస్థ భాషకును మిక్కిలి యంతరమేర్పడినది. సంస్కృతభాషా ప్రాబల్య మిందుకు ముఖ్యకారణమని వేరేచెప్ప నక్కఱలేదు. సంస్కృతభాష పాణినీయాది వ్యాకరణములమూలమునను నిఘంటువులమూలమునను స్థిరీభూతమగుటచేతను, వ్యవహారభ్రష్టమగుటచేతను, నందు చాలవఱ కెట్టిమార్పును గలుగకుండెను. కాని నాటనుండి నేటివఱకు బ్రవాహరూపమున వచ్చుచున్న జీవద్భారతీయ భాషలుగూడ సంస్కృతభాషానుయాయులగుటచే గ్రంధస్థభాషకును వ్యవహారభాషకును నింతటి భేదమేర్పడినది. ఈ యంతరముండుట మంచిదా కాదా యనువివాద మన్నిభాషలయందును గలదు. అన్ని ప్రాంతముల యందును వ్యావహారికభాష పూర్వకాలపు గ్రాంధికభాషను గొంతవఱకైనను త్రోసిపుచ్చి, యాస్థానము నాక్రమించుకొనుచున్నది. ఇట్లుండ బూర్వగ్రాంధికభాషతోడి పరిచయము సంపూర్ణముగ లేకపోవుటచేతను. వ్యవహారము నతిక్రమింప సాధ్యము కాకపోవుటచేతను, గ్రంధకర్తలు కొన్నికృతకరూపముల గల్పించుకొనుట సంభవించుచున్నది. ఈ కృతకరూపములు కొన్నియెడల వ్యవహారములో గూడ స్థిరములగుట సంభవించుచుండును. ఈరీతిగ నాంధ్ర భాషయందును వివిధములగు మార్పులు కలుగుచున్నవి. ఈ మార్పులన్నియు నేరీతిగ నేయే కారణములచే గలిగినవో తెలియ జేయుటయే యాంధ్రభాషా చరిత్ర ముఖ్యోద్దేశము.
ఆంధ్రులు.
ఆంధ్రులను జాతివారినిగుఱించి మనకు వేదకాలమునుండియు దెలియవచ్చుచున్నది. ఐతరేయ బ్రాహ్మణమున నీక్రింది వాక్యములున్నవి. "తస్యహ విశ్వామిత్ర స్యైకశతం పుత్రా ఆను; పంచాశత్ ఏక జ్యాయాంసో మధుచ్ఛందస:; పంచాశత్ కనీయాంస:; తద్వై జ్యాయాంసో నతే కులమ్ మేనిరే. తాన్ అనువ్యాజహారన్ తాన్వ:ప్రజా భక్షిస్తేతిత ఏతేంధ్రా: పుండ్రా: శబరా: పుళిందా మూతిబా ఇత్యుదంత్యా బహవో భవంతి వైశ్వామిత్రా దస్యూనామ్ భూయిష్ఠా:" - పైదానిప్రకార మాంధ్రులు విశ్వా