పుట:AndhraRachaitaluVol1.djvu/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుపతి వేంకట కవులు

1871 - 1919

1870 - 1950

ఈ జంటకవులలో మొదటివారు దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు. రెండవ వారు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు. తిరుపతి శాస్త్రిగారిది వెలనాటి శాఖ. అభిజనము: ఎండగండి (కృష్ణామండలము).తల్లి: శేషమ్మ. తండ్రి: వేంకటావధాని. జననము: 1871 సం. నిర్యాణము: 1919. వేంకటశాస్త్రిగారిది ఆరామద్రావిడశాఖ. జన్మస్థానము: ఏనాము [ఫ్రెంచివారిది]. నివాసము: కడియము. తల్లి: చంద్రమ్మ. తండ్రి: కామయ్య. జననము 1870 ప్రమోదూత సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశీ సోమవారము. నిర్యాణము: 15 పిబ్రవరి 1950 సం. శివరాత్రి పుణ్యదినమున. విరచిత గ్రంథములు: పాండవజననము, పాండవోద్యోగము, పాండవాశ్వమేధము, పాండవ రాజసూయము, పాండవ విజయము, పాండవ ప్రవాసము, ముద్రారాక్షసము, మృచ్ఛకటికము, ప్రభావతీప్రద్యుమ్నము, బాల రామాయణము [నాటకములు]. బుద్ధచరిత్రము, లక్షణా పరిణయము, ఏలామహాత్మ్యము, శ్రీనివాసవిలాసము, దేవీభాగవతము, పతివ్రత, సుశీల, పూర్వహరిశ్చంద్రము, శివలీలలు, నానారాజ సందర్శనము, శ్రవణానందము [పద్యకృతులు]. విక్రమాంకదేవ చరిత్రము, చంద్రప్రభాచరిత్రము, హర్షచరిత్రము, [వచనగ్రంథములు]. గుంటూరిసీమ, గీరతము, శృంఖలాతృణీకరణము, పశ్యాం పుశ్యాం, పశ్యశబ్దవిచారము, శనిగ్రహము [విమర్శగ్రంథములు]. శతావధాన సారము, గుంటూరు శతావధానము, పినపాడు శతావధానము, వేమవరాగ్రహార శతావధానము [శతావధానకృతులు] ఇత్యాదులు.

దోసమటం చెఱింగియును దుందుడుకొప్పగ బెంచినార మి

మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగ

రోసముకల్గినం గవివరుల్ మముగెల్వుడు-గెల్చిరేని యీ

మీసము తీసి మీపదసమీపములం దలలుంచి మ్రొక్కమే.