పుట:AndhraRachaitaluVol1.djvu/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి

1863 - 1940

తెలంగాణ్యబ్రాహ్మణులు. గౌతమసగోత్రులు. ఆపస్తంబసూత్రులు. తండ్రి: బ్రహ్మావధాని. తల్లి: సుబ్బమ్మ. జననము 2-2-1863. నిధనము 29-101940. అభిజనము: తూర్పుగోదావరీ మండలములోని పలివెల గ్రామము. మనుగడ: కాకినాడలో. రచనలు: సంస్కారవిషయకముగా వీరువ్రాసిన వ్యాసములు 24. అధ్యాత్మవిషయక వ్యాసములు 17. మతధర్మవిషయక వ్యాసములు 43. సాహిత్యవిషయక వ్యాసములు 60. కవిత్వవిషయక వ్యాసములు 16. ప్రకృతిశాస్త్రవిషయక వ్యాసములు 11. నన్నయ్యభట్టారక చరిత్రము, కురుపాండవ దాయభాగనిర్ణయము, మంగతాయి, సైంధవవధ (నాటకములు) ఉపన్యాసపయోనిధి (1 సంపుటము) తారకతారావళి, పర్వతసందర్శనము, మనువసు ప్రకాశిక, పెద్దాపురసంస్థాన చరిత్రము, ప్రాయశ్చిత్తపశునిర్ణయము, భాస్కరోదంతము మున్నగునవి ప్రత్యేకగ్రంథములు. ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక-భారతి-శారద-ఆంధ్రపత్రిక ఉగాది సంచికలు-ముద్దుల మూట-ఉదయలక్ష్మి-సుజాత. ఈ పత్రికలలో వీరి రచనలు గలవు.

"అల్పదోషమైనా కావ్యమందు సహించక విమర్శ చేసేటప్పుడు యమునికన్న ఎక్కువనిర్ఘృణుడని పేరుపొందిన పండితు" లని బ్రహ్మయ్యశాస్త్రిగారిని గిడుగు రామమూర్తి పంతులుగారు ప్రశంసించిరి. వాస్తవముగా నీయన యంతటివాడే. హరిబ్రహ్మాదు లడ్డుపడినను విమర్శచేయుటలో నీయనకు జంకులేదు. సముద్రపుటుప్పునకు నడవి యుసిరకకు గలిగినసంబంధము వలె "కాకినాడ ట్రెజరీ డిప్యూటీకచేరీ గుమాస్తా" పనికి శాస్త్రిగారి యపూర్వ సారస్వత విషయవిమర్శనమునకు జక్కనిబాంధనము కుదిరినది. "అన్యథా చింతితం కార్యం దైవ మన్యత్ర" అనునట్లు భగవంతు డీ విమర్శకాగ్రేసరుని "గుమాస్తా' పని చేసికొనుమని యాదేశించినాడు. శరీర మొకచోట - మనస్సు