పుట:Aliya Rama Rayalu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాకటస్థితి నిల్చు నౌకువారు" అనియును, 'ఠీవిగ నౌకువారును కడింది రహిన్ వెలుగోటివారలా రావెలవారు గూడుకొని' అనియును జెప్పియుండుట వలన ధ్రువపడు చున్నది. అచ్యుత దేవరాయలవారి కాలమునను సామ్రాజ్య సామంతులలో బ్రముఖులై ఇతడును, ఇతని కుమారులును నాతనికి దోడునీడగనుండి సర్వవిధముల దోడ్పడు చుండిరి. మఱియునీతని తమ్మునికుమారు డగునళియరామరాజునకు సామ్రాజ్యద్రోహి యగుసలకముమ్మయను సంహరించిన సందర్భమున నాతనిప్రక్కనుండి యప్పటియుద్దములో బాల్గొన్నట్టు,

      "సలకయతిమ్మాసురదు
       ర్విలసితవిలయాబ్ధిలగన విహ్వలవసుధా
       వలయస్థితికృతివివృతో
       జ్వలతర ధరణీవరాహ వరబిరు దాంకా"

అనుపద్య బాలభాగవతములోని పద్యమువలన వేద్యమగుచున్నది. ఇంతియగాదు,

      'కడిమిమై మానువకడ రణక్షోణి
       గడుసరి నేదులఖాను జయించె'


ననిద్విపదబాలభాగవతమునందును, 'మానువకడ సవాబూని పోరను బరాజయము నొందించె నేశౌర్యశాలి' యనిపద్యబాలభాగవతమునందును జెప్పియుండుటచేత నితడువిజాపురసుల్తా నగునాలీఅదిల్‌షాహాను మానువదుర్గముకడ జయించెనని నిశ్చయింప వలసి యున్నది. ఇదియు క్రీ. శ. 1542